Tuesday, April 30, 2024

‘మెరిట్స్‌’ ఆస్తులు ప్రభుత్వానికి.. గౌతమ్‌రెడ్డి పేరిట అగ్రికల్చర్‌ యూనివర్సిటీ

మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల (మెరిట్స్‌)ను దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరుతో అగ్రికల్చర్‌ యూనివర్సిటీగా మార్చాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మాజీ ఎంపీ రాజమోహన్‌రెడ్డి కోరారు. ఇటీవల మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. బుధవారం ఇంజినీరింగ్‌ కళాశాలలో జరిగిన…మంత్రి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలకు సీఎం వైఎస్‌ జగన్‌ విచ్చేశారు.

ఈ సందర్భంగా సీఎంతో పెద్దాయన మెట్ట ప్రాంత అభివృద్ధి, పలు విషయాల గురించి మాట్లాడారు. ఉదయగిరిలో వందెకరాల్లో తాను ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన రూ.225 కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీఎంతో చెప్పారు. దీనికిగానూ మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరుతో అగ్రికల్చర్‌ యూనివర్సిటీగా మార్చాలని కోరారు. స్పందించిన సీఎం త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనే కళాశాల పేరు మార్చడంతోపాటు అగ్రికల్చర్‌ యూనివర్సిటీగా మార్చేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాలతోపాటు గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన ఒంగోలు మెట్ట ప్రాంతాలకు తాగు, సాగు నీరందించే వెలుగొండ ప్రాజెక్టు, సోమశిల హై లెవెల్‌ కెనాల్, ఫేజ్‌–1, ఫేజ్‌–2లను పూర్తి చేసి త్వరగా డెల్టాగా మార్చాలని రాజమోహన్‌రెడ్డి కోరారు. వెలుగొండ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement