Sunday, April 28, 2024

AP: త‌నకు అన్నగా కాకపోయినా.. సీఎంగానైనా జవాబు చెప్పాలి: సునీత

అమరావతి : త‌న ప్ర‌శ్న‌కు అన్న‌గా కాక‌పోయినా… సీఎంగానైనా జ‌గ‌న్ జ‌వాబు చెప్పాల‌ని మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీత నర్రెడ్డి అన్నారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో సునీత మాట్లాడుతూ…. ఎవరినైనా ఒకసారి మోసం చేయవచ్చని.. పదేపదే చేయలేరనే విషయాన్ని గ్రహించాలన్నారు.వైఎస్‌ షర్మిల, తాను ఎవరి ప్రభావంతోనో మాట్లాడుతున్నట్లు ఆరోపణలు చేస్తున్నారని సీఎం జగన్‌, వైకాపా నేతలను ఉద్దేశించి ఆవేదన వ్యక్తం చేశారు. వివేకా హత్య జరిగాక తనతో తోలుబొమ్మలాట ఆడుకున్నారని వ్యాఖ్యానించారు. గతంలో మిమ్మల్ని గుడ్డిగా నమ్మి చెప్పినట్లు చేయాల్సి వచ్చిందన్నారు.

తప్పును గ్రహించానని.. దాన్ని సరిదిద్దుకునే సమయం వచ్చిందని చెప్పారు. ప్రజలంతా గ్రహిస్తున్నారని.. వాస్తవాలేంటో వారికి తెలుసన్నారు. హైదరాబాద్‌, కడపలో తాను అడిగిన ప్రశ్నలకు అన్నగా కాకపోయినా.. సీఎంగానైనా సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా జగన్‌కు సునీత మరికొన్ని ప్రశ్నలు సంధించారు. ఎమోషన్‌ మాటలతో ప్రతిసారీ అందర్నీ మోసం చేయలేరన్నారు.

వివేకాను చంపిందెవరో దేవుడు, కడప జిల్లా ప్రజలకు తెలుసని అన్నారు. ఆ జిల్లా ప్రజలంటే అందులో మీరు కూడా ఒకరు కదా! అలాంటప్పుడు హత్య ఎవరు చేశారో.. ఎవరు చేయించారో మీకూ తెలిసినట్లే కదా! అది ఎందుకు బయటపెట్టడం లేదు. చెప్పాల్సిన బాధ్యత సీఎంగా మీపై ఉంది. అవినాష్‌రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారో సమాధానం చెప్పాలి. ఈ కేసులో ఆయన ప్రమేయం గురించి తెలిస్తే.. ఇంకేమైనా బయటకు వస్తాయని భయపడుతున్నారా? అంతభయం దేనికి? నేరుగా మాట్లాడాలంటే చెప్పండి. నాకు అభ్యంతరం లేదన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement