Thursday, May 2, 2024

ఏమైనా చేసుకోండి బ్రదర్​, ఏపీ రాజకీయాల్లో తలదూర్చొద్దు.. క్రిస్టియన్‌ జేఏసీ ఆల్టిమేటం..

ఏపీ సీఎం జగన్‌ బావ, మత ప్రబోధకుడు బ్రదర్‌ అనిల్ ముందుకు కదలకుండా లాక్​ చేస్తున్నారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడానికి సహకరించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, క్రిస్టియన్‌, మైనార్టీ సమస్యలను సీఎం జగన్​ పట్టించుకోవడం లేదని.. తమరైనా చొరవచూపాలని ఒత్తిళ్లు రావడంతో బ్రదర్‌ అనిల్‌ ఏపీలో పర్యటిస్తున్నారు. తిరుపతి, వైజాగ్‌, విజయవాడలో పర్యటించి పలువురు నాయకులతో చర్చించి ప్రభుత్వ పనితీరుపై అడిగి తెలుసుకున్నారు. కాగా, పాదయాత్రలో ఇచ్చిన హామీలను పరిష్కరించడంలో జగ‌న్‌ ప్రభుత్వం 3 సంవత్సరాలుగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, కనీసం చర్చించడానికైనా సమయం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు తిరుపతి, వైజాగ్‌లో బ్రదర్‌ అనిల్‌తో క్రిస్టియన్‌ సంఘాలు సమావేశం కావడం రాజకీయ చర్చకు దారితీసింది .

రాజకీయ పార్టీ పెట్టాలని వివిధ సంఘాల ప్రతినిధుల నుంచి సూచనలు వస్తున్నాయని, పార్టీ పెట్టడం అంతా ఈజీ కాదని అంటూనే నర్మగర్భంగా పలు వ్యాఖ్యలు చేశారు అనిల్​. అయితే బ్రదర్ అనిల్ పర్యటనలపై ఏపీ క్రిస్టియన్ జేఏసీ స్పందించింది. ఈ క్రమంలో ఇవాళ తిరుపతిలో జేఏసీ భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించింది. బ్రదర్ అనిల్ రాజకీయ పార్టీ పెడతాననడం హాస్యాస్పదంగా ఉందని, దైవ సందేశం అందించే బ్రదర్ ఎప్పుడు రాజకీయ అవతారం ఎత్తాడో చెప్పాలని ఎద్దేవా చేశారు. ఇప్పటికే తెలంగాణలో వైఎస్సార్‌టీపీ పేరుతో షర్మిల పార్టీ నడిపిస్తున్నారని, బ్రదర్‌ అనిల్‌ మీరు కూడా తెలంగాణలో పార్టీ పనులు చూసుకోవాలని, ఏపీ రాజకీయాల్లో తలదూర్చవద్దని పలువురు వ్యాఖ్యలు చేయడం సంచలనం కలిగిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement