Friday, April 26, 2024

మిల్లర్ల చేతిలో పౌరసరఫరాల శాఖ.. రైతు భరోసా కేంద్రాలు దళారుల కోసమేనా: జ‌న‌సేన‌

అమరావతి, ఆంధ్రప్రభ: ఆరుగాలం కష్టపడి పంట పండించే రైతుల నుంచి బస్తాకు రూ. 200 చొప్పున దోచేసుకొంటు-న్నా ముఖ్యమంత్రి జగన్‌లో చలనం రావడం లేదని, అంటే ఈ దోపిడీకి సూత్రధారులు ఎవరో రైతాంగానికి, ప్రజలకు అర్థమవుతోందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు. రైతులను దోచుకోవడానికి ఈ పాలకులకు మనసెలా వస్తోందని, రైతుల శ్రేయస్సు పట్టని పాలకుడు ఉండటం వల్లే రైతన్నలు, కౌలు రైతులు జీవితంపై విరక్తి చెందుతున్నారని గురువారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించామని, ఆఫ్రికా కూడా ఆదర్శంగా తీసుకొంటోందని గొప్పలు చెప్పుకొంటు-న్న పాలకులు వరి రైతుల బాధలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. రైతులకు భరోసా ఇవ్వని కేంద్రాలు ఎందుకని నిలదీశారు. ఆర్బీకేల్లో ధాన్యం అమ్మడానికి వెళ్ళిన రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులు ఇప్పటికే తమ పార్టీ దృష్టికి వచ్చాయని, అవి దళారులకు నిలయాలుగా మారిపోయాయని మనోహర్‌ ఆరోపించారు.

రైస్‌ మిల్లర్లు రైతుల ఇక్కట్లను ఆసరాగా చేసుకొని గిట్టు-బాటు- ధర ఇవ్వడం లేదని, రైతుల ఆధార్‌ వివరాలు నమోదు చేయకుండా మిల్లర్లూ, రైతు భరోసా కేంద్రాల నిర్వాహకులు, పౌర సరఫరాల శాఖ చేస్తున్న మాయ వల్ల అన్నదాతలు మోసపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వేల మంది రైతుల చిరునామాలు గల్లంతు చేసి కుంభకోణానికి తెర తీసిన విషయాన్ని వైసీపీ ఎంపీ కూడా వెల్లడించి, జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లినా ప్రభుత్వం తేలిగ్గా తీసుకొందన్నారు. ఇది ఒక సమస్యే కాదని ఉన్నతాధికారులు, మంత్రులతో చెప్పించడం ద్వారా ఈ కుంభకోణంలో ఉన్న పెద్దలెవరో అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. రైతుల నుంచి ధాన్యం సేకరించి సకాలంలో సొమ్ములు చెల్లించాల్సిన పౌరసరఫరాల శాఖ మిల్లర్ల చేతిలో కీలుబొమ్మగా మారిందని మండిపడ్డారు. ఫలితంగా రైతులు నష్టపోతున్నారన్నారు. రైతులకు గోనె సంచులు, రవాణా ఛార్జీలు ఇవ్వట్లేదని, ఆ బాధలేవో రైతులే పడుతూ ధాన్యాన్ని చేరిస్తే, సొమ్ములు కూడా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలకరి పంట సమయం మొదలవుతున్న సమయంలో వారికి పంట పెట్టు-బడులు అవసరమని, అయినా సకాలంలో ధాన్యం అమ్మిన డబ్బులు ఇవ్వకపోతే ఎలాగని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలులో అక్రమాలపై జనసేన పార్టీ పోరాడుతుందని, రైతులకు అండగా నిలుస్తుందని నాదెండ్ల మనోహర్‌ స్పష్టం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement