Saturday, May 18, 2024

ఏపీ ప్ర‌భుత్వానికి ఉద్యోగ సంఘాల డెడ్ లైన్

ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వానికి ఉద్యోగ సంఘాలు పీఆర్సీపై డెడ్ లైన్ పెట్టాయి. ఈ నెలాఖరులోగా పీఆర్సీ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ప్రభుత్వానికి ఈ నెలాఖరు వరకు సమయం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని ఏపీజేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల 27 లోపు అన్ని సంఘాల సమావేశాలు నిర్వహించి, ఆ తరువాత సీఎస్ ను కలిసి త‌మ భవిష్యత్ కార్యాచరణ తెలియజేస్తామ‌న్నారు. తాము దాచుకున్న డబ్బులు కూడా త‌మకు ఇవ్వడం లేదని.. పీఆర్సీ నివేదిక పై సీఎస్ హామీకే విలువలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే.. వారంలో సీపీఎస్ రద్దు చేస్తామని ఇచ్చిన హామీ అమలు చేయలేదన్నారు. జగన్ ప్రభుత్వానికి 151 సీట్లు రావడంలో ఉద్యోగుల భాగస్వామ్యం ఉంద‌ని, ఈ ప్రభుత్వానికి ఉద్యోగుల ఓట్లు అవసరం లేదా ? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. పీఆర్సీ నివేదిక శుక్రవారం ఇస్తామన్న ప్రభుత్వం ఇవ్వలేదని.. త‌మ‌కు రావాల్సిన బకాయిలు మార్చి నాటికి క్లియర్ చేస్తామని చెప్పారు.. అందుకే నిన్నటి సమావేశం బాయ్ కాట్ చేశామని వెల్లడించారు. త‌మ రెండు జేఏసీల ఆధ్వర్యంలో 200 సంఘాలున్నాయని, త‌మ సంఘాలన్నీ క్రింది స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు.

అలాగే ఏపీ జేఏసీ అమ‌రావ‌తి ఛైర్మ‌న్ బొప్ప‌రాజు ఈ ప్రభుత్వం వచ్చాకా ఒక్క డీఏ కూడా రాలేదని విమర్శించారు. పీఆర్సీ నివేదిక కూడా త‌మకు ఇవ్వలేదన్నారు. పీఆర్సీ నివేదికపై అధికారుల కమిటీ పరిశీలనపై త‌మకు నమ్మకం లేదన్నారు. ఈ నెల 27న ఏపీఎన్జీవో జనరల్ బాడీ సమావేశం.. 28వ తేదీన త‌మ రెండు జేఏసీల సమావేశముంద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement