Saturday, April 27, 2024

స్పీడ్‌ పెంచిన సీఆర్డీఏ, రాజధాని రైతుల ప్లాట్లలో మౌలిక సదుపాయాలు.. రూ. 305 కోట్లతో అభివృద్ధి పనులు

అమరావతి, ఆంధ్రప్రభ: రాజధాని ప్రాంతంలో భూ సమీకరణ కింద భూములిచ్చిన రైతుల ప్లాట్లు (ఎల్‌పీఎస్‌)లో మౌలిక సదుపాయాల కల్పనపై సీఆర్డీఏ స్పీడ్‌ పెంచింది. హైకోర్టు ఆదేశాలను అమలు చేసే క్రమంలో ఇప్పటికే ఒక ఎల్‌పీఎస్‌ జోన్‌లో అభివృద్ధి పనులు చేపట్టింది.. తాజాగా మరో మూడు జోన్లలో మౌలిక వసతులకు సోమవారం భూమిపూజ నిర్వహించనున్నారు. జోన్‌-5లోని (బీ, సీ,డీ) పరిధిలో రూ. 100 కోట్ల చొప్పున నిధులతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. అబ్బరాజుపాలెం, దొండపాడు, తుళ్లూరు, రాయపూడి గ్రామాల్లో ప్లాట్లలో మౌలిక వసతులు కల్పిస్తారు. జోన్‌-5(బీ) పరిధిలో రూ. 93.6 కోట్లతో రహదార్ల నిర్మాణ పనులు ప్రారంభించినట్లు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాథికార సంస్థ (సీఆర్‌డీఏ) కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ తెలిపారు. రహదార్లు, వంతెనలు, తాగునీటి సరఫరా, వరదనీటి నిర్వహణ కాల్వలు, డ్రెయినేజి, మురుగునీటి శుద్ది కర్మాగారాలు (ఎస్‌టీపీ), పచ్చదనానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. నిర్మాణ అభివృద్ధి పనుల్లో భాగంగా సీఆర్‌డీఏ మెగా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. రాజధాని మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా 5బీ ఎల్‌పీఎస్‌లో చేపట్టిన పనుల వల్ల 1130.60 ఎకరాల్లో మొత్తం 3417 ప్లాట్లలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తారు. 25 మీటర్ల వెడల్పులో రెండులైన్ల బీటీ రోడ్డు 9.730 కిలోమీటర్లు, 17 మీటర్ల వెడల్పుతో రెండులైన్ల సీసీ రోడ్లు 15.360 కిలోమీటర్లు, 15.6 మీటర్ల వెడ ల్పు కలిగిన మరో రెండులైన్ల సీసీ రోడ్లను 14.9 కిలోమీటర్ల మేర ఏర్పాటవుతాయి. వీటితో పాటు 12 మీటర్ల వెడల్పుతో సీసీ రోడ్లను 4.360 కిలోమీటర్లు వెరసి మొత్తం 44.35 కిలోమీటర్ల రహదార్ల నిర్మాణం జరుగుతుంది. జోన్‌-5 (సీ) ఎల్‌పీఎస్‌లో ప్లాట్ల అభివృద్ధిలో భాగంగా రూ. 110.01 కోట్ల మేర రహదారి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.

మాస్టర్‌ ప్లాన్‌కు అనుగుణంగా 5సీ ఎల్‌పీఎస్‌లో పనుల వల్ల 1102.49 ఎకరాల్లో 2668 ప్లాట్లలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామని కమిషనర్‌ వివరించారు. మొత్తం 1159.28 ఎకరాల్లో 1585 ప్లాట్లలో పనులు చేపడతామన్నారు. ఈ ప్రాంతంలో 25 మీటర్ల వెడల్పుతో రెండులైన్ల బీటీ రోడ్లు 9.3 కిలోమీటర్లు, 17 మీటర్ల వెడల్పుతో రెండులైన్ల సీసీ రోడ్లు 17.270 కిలోమీటర్లు, 15.6 మీటర్ల వెడల్పు గల మరో రెండులైన్ల సీసీ రోడ్లు 10.020 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటవుతాయి. 12 మీటర్ల వెడల్పుగల రెండులైన్ల 5.740 కిలోమీటర్లలో ఏర్పాటుకానున్న రెండులైన్ల సీసీ రోడ్డుతో కలిపి మొత్తం 51.14 కిలోమీటర్ల రహదారి సౌకర్యం కల్పిస్తారు. వీటితో పాటు 93.885 కిలోమీటర్ల పరిధిలో వరదనీటి పారుదల కాల్వలు, 92.022 కిలోమీటర్ల విస్తీర్ణంలో త్రాగునీటి సదుపాయం, 37.374 కిలోమీటర్లలోపు వ్యర్థ నీటి కాల్వల నిర్మాణాన్ని చేపడతారు. ఇక జోన్‌-5 (డీ)లో రూ. 91.6 కోట్లతో రైతుల ప్లాట్లను అభివృద్ధి చేస్తారు. దీంతో ఈ ప్రాంతంలో 1159.28 ఎకరాల్లో 1585 ప్లాట్లకు మౌలిక వసతులు కల్పిస్తారు. 25 మీటర్ల రెండులైన్ల బీటీ రోడ్లు 9.300 కిలోమీటర్లు, 17 మీటర్ల రెండులైన్ల సీసీ రోడ్లు 17.270 కిలోమీటర్లు, 15.6 మీటర్ల రోడ్లు 10.840 కిలోమీటర్లతో కలుపుకుని మొత్తం 37.41 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరుగుతుంది. ఈ ప్రాంతంలో 69.38 కిలోమీట ర్ల వరద నీటి కాల్వలు, 68.69 కిలోమీటర్లు మంచినీటి పైపులైన్లు, 25.02 కిలోమీటర్ల మేర వ్యర్థ నీటి కాల్వలు ఏర్పాటవుతాయని కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement