Monday, May 6, 2024

AP : వైఎస్‌ఆర్‌ను తిట్టిన వారికే సీఎం జగన్‌ పెద్దపీట వేశారు… ష‌ర్మిల‌

జగన్ క్యాబినెట్‌లో ఉన్నవారందరూ వైఎస్సార్‌ను తిట్టినవారేనని, వైఎస్‌ఆర్‌ను తిట్టిన వారికే జగన్‌ పెద్దపీట వేశారని ఏపీ కాంగ్రెస్​ ఛీఫ్​ షర్మిల అన్నారు. ఇవాళ ఆమె రేపల్లె నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వ‌హించారు. అనంత‌రం ఆమె మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో వైఎస్సార్‌ను తిట్టిపోశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

”ఇదే బొత్స వైఎస్సార్‌ను త్రాగుబోతు అని తిట్టాడు. ఇదే బొత్స జగన్‌కు ఉరి శిక్ష వేయాలని అన్నాడు. జగన్ మోహన్ రెడ్డి బినామీలు అన్నాడు. విజయమ్మను సైతం అవమాన పరిచాడు. ఇలాంటి బొత్స జగన్‌కు తండ్రి సమానులు అయ్యారు” అంటూ ఎద్దేవా చేశారు. వీళ్ళందరూ జగన్‌ తండ్రులు, అక్కలు, చెల్లెల్లు.. నిజంగా ఆయన కోసం పని చేసిన వాళ్ళు ఈయనకు ఏమి కారు అని అన్నారు.

జగన్ కోసం పాదయాత్రలు చేసిన వాళ్ళు ఏమి కారు. ఆయన కోసం పని చేసి గొడ్డలి పోటుకు గురైన వాళ్ళు ఏమి కారు. వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ పేరులో వైఎస్‌ఆర్‌ లేడు.. Y అంటే YV సుబ్బారెడ్డి,S అంటే సాయి రెడ్డి ,R అంటే రామకృష్ణా రెడ్డి” అని వైఎస్‌ఆర్‌సీపీకి కొత్త అర్ధం చెప్పారు. 10 ఏళ్లలో రేపల్లె లో అభివృద్ధి జరిగిందా ?, ఏ వర్గానికి అయినా న్యాయం జరిగిందా ? అని షర్మిల ప్రజలను ప్రశ్నించారు.

”సీఎం జగన్‌ ఇక్కడకు వచ్చారట.. హామీలు ఇచ్చారట.. చెక్ డ్యాం లు కట్టి లక్ష ఎకరాలకు సాగునీరు ఇస్తామన్నారట.. 100 పడకల ఆసుపత్రి అన్నారట.. అక్వా రైతుల కోసం ఆక్వా పార్క్ అన్నారట.. ఇంటింటికీ కుళాయి కనెక్షన్ ఇస్తామని చెప్పారట.. షిప్పింగ్ హార్బర్ కడతాం అన్నారట. కానీ ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదు ఈ సీఎం జగన్‌” అంటూ వైఎస్ షర్మిలా రెడ్డి విమర్శలు గుప్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement