Wednesday, May 1, 2024

పుంగ‌నూరు, ప‌ల‌మ‌నేరు లో వైసిపి పాగా…

తిరుపతి, ప్రభన్యూస్‌బ్యూరో : చిత్తూరు జిల్లాలోని నగ ర,పురపాలికల ఎన్నికలలో భాగంగా బుధవారం ముగిసిన నామినేషన్ల ఉపసంహ రణలతో 130 స్ధానాల్లో అభ్యర్ధులు ఏకగ్రీవంగా విజయం సాధించారు. అందులో అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 129 మంది ఉండగా మిగిలిన ఒక్క స్ధానంలో తెలుగుదేశం అభ్యర్ధి ఏకగ్రీవంగా గెలిచారు. జిల్లాలోని తిరుపతి, చిత్తూరు నగరపాలికలకు చెందిన 100 డివిజన్లలో 58 డివిజన్లలో. పుంగనూరు,మదనపల్లె, పలమనేరు, నగరి, పుత్తూరు పురపాలికలకు చెందిన 148 వార్డులలో 72 వార్డులలో అభ్యర్ధులు ఏకగ్రీవంగా విజయం సాధించారు. ఈ క్రమంలో 31 వార్డుల్లో 31 వార్డులను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధులు ఏక గ్రీవంగా గెలవడంతో పుంగ నూరు పురపాలిక ఆ పార్టీ స్వంతమైంది. అదేవిధంగా పలమనేరు పురపాలికకు చెందిన 26 వార్డుల్లో 18 వార్డులను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధులు ఏకగ్రీవంగా గెలవడంతో ఆ పురపాలిక కూడా ఆ పార్టీ పరమైనట్టయింది. నగరి పురపాలికలో 7 వార్డులకు ఏకగ్రీవ ఎన్నికలు కాగా 6 వార్డుల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్ధులు, ఒక వార్డులో తెలుగుదేశం అభ్యర్ది గెలుపొందారు. అదేవిధంగా పుత్తూరు పురపాలికలో ఒక్క ఏకగ్రీవ ఎన్నిక మాత్రం ఖరారైంది. మొత్తంమీద ఈ నెల 10వ తేదిన జిల్లాలో మిగిలిన 50 నగరపాలిక డివిజన్లకు, 76 పురపాలికల వార్డులకు ఎన్నికలు జరగనున్నాయని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement