Tuesday, April 30, 2024

తిరునగరికి ఆధ్యాత్మిక శోభ : భూమన కరుణాకర్ రెడ్డి

తిరుపతి సిటీ : తిరుపతి జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయని, తిరునగరి జన్మదినాన్ని పురష్కరించుకుని మరింత ఆధ్యాత్మిక శోభ ను సంతరించుకుందని తిరుపతి ఎమ్మెల్యే, టీటీడీ పాలక మండలి ప్రత్యేక ఆహ్వానితులు భూమన కరుణాకర రెడ్డి అన్నారు. మానవ వికాస వేదిక చైర్మన్ హోదాలో ఆధ్వర్యంలో గురువారం జఠిగిన తిరుపతి 892వ జన్మదిన వేడుకలు ఆకట్టుకున్నాయి. జియ్యర్ స్వాములు వెంట రాగా, వేద పండితుల మంత్రోఛ్చరణలు, భజన కీర్తనలు, మంగళ వాయిద్యాల ఆద్యంతం భక్తి ప్రపత్తులను చాటుతూ ప్రదర్శన సాగింది. పౌరాణిక కళా బృందాల లయబద్ద విన్యాసాల నడుమ సాగిన కళా ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. భూమన నిర్వహించిన ఆధ్యాత్మిక శోభా యాత్రను.. దారి పొడవునా పచ్చ తోరణాలు కట్టి, కర్పూర హారతులు పడుతూ, పూజలు నిర్వహిస్తూ భక్త జనులు స్వాగతించారు. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా ప్రపంచ వ్యాప్త ప్రఖ్యాతులతో విరాజిల్లుతున్న నేటి తిరుపతిని 892 ఏళ్ల కిందట శ్రీ గోవిందరాజపురం గ్రామం పేరిట పునాది రాయి వేసి మరీ ఏర్పరిచిన శ్రీ రామానుజాచార్యలను స్మరించుకుని కార్యక్రమాన్ని భూమన చేపట్టారు. స్థానిక శ్రీ గోవింద రాజాస్వామి ఆలయంలోని శ్రీ రామానుజాచార్యుల విగ్రహానికి పూజలు నిర్వహించి ఆలయ వీధుల్లో శోభాయాత్రను నిర్వహించారు.

ఈ సందర్భంగా భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ… టీటీడీకి అనుసంధానం చేస్తూ భవిష్యత్ లో ప్రపంచమంతటా తిరుపతి జన్మదిన వేడుకలను నిర్వహించేలా చర్యలు చేపడుతామని వెల్లడించారు. భగవద్ శ్రీ రామానుజాచార్యులు వారి దివ్య హస్తాలతో పునాది వేసి, 892 సంవత్సరాల కిందట శ్రీ గోవింద రాజపురంగా గ్రామం గా నేటి తిరుపతిని ఏర్పాటు చేశారన్నారు. ప్రపంచంలో మరే ఇతర నగరాలకూ పుట్టిన తేదీ అంటూ లేదని, ఒక్క తిరుపతి కి మాత్రమే అంతటి ప్రాశస్త్యం ఉందన్నారు. 1130 సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీన తన 112వ ఏట శ్రీ రామానుజా చార్యులు శ్రీ గోవింద రాజుల స్వామి విగ్రహ ప్రతిష్ఠతో పాటు ఆలయ వీధులకు శంకుస్థాపన చేసినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయిని, శాసనాలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. కాలగర్భంలో తిరుపతి జన్మదినపు తేదీ ప్రాముఖ్యతకు నోచుకోలేక పోయినా, ఇన్నేళ్ల తర్వాతైనా ఈ తరంలో తొలి సారి జన్మదిన వేడుకలు నిర్వహించడం తన అదృష్టంగా పేర్కొన్నారు. భావితరాలు మున్ముందు
ఈ వేడుకలను కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యుడు పోకల అశోక్ కుమార్, నగర మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, భూమన అభినయ్, నగర కమిషనర్ పీఎస్ గిరీష, ఎస్పీ వెంకట అప్పుల నాయుడు, నగర అదనపు కమిషనర్ హరిత పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement