Sunday, April 28, 2024

AP | అవినీతి పాలనకు సీమ పౌరుషాన్ని చూపండి : నారా భువనేశ్వరి

రాయచోటి (రాయలసీమ ప్రభన్యూస్ బ్యూరో ) : రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చిన అవినీతి పాలకులను రాయలసీమ ప్రజలు పౌరుషంగా అడ్డుకుని, వారి చేతి నుండి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. రాయచోటి నియోజకవర్గంలో నిజం గెలవాలి పర్యటన సందర్భంగా ఈరోజు సాయంత్రం కార్యకర్తలతో భువనేశ్వరి మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ గా పేరుపొందిన ఏపీ నేడు అప్పుల ఆంధ్రప్రదేశ్ అయ్యిందన్నారు.

దేశంలో రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని వైసీపీ ప్రభుత్వం నిలబెట్టింది. గతంలో ఏపీలో ఉన్న పరిశ్రమలన్నీ ప్రక్కనున్న రాష్ట్రాలకు తరలివెళ్లిపోయాయన్నారు . యువతకు ఉద్యోగావకాశాలు లేక ఇబ్బందులుపడుతుండగా టీడీపీ పాలనలో ఏపీకి పెట్టుబడులు వస్తే..నేడు ఆ కంపెనీలు ఏపీని వదిలిపారిపోతున్నాయని భువనేశ్వరి అన్నారు. రాష్ట్ర సచివాలయాన్ని సహా తాకట్టు పెట్టి, అప్పులు తెచ్చి ఆ అప్పులను మన నెత్తిమీద వేస్తున్నారని విమర్శించారు.

దేశంలోనే రాజధాని లేని ఏకైక రాష్ట్రంగా ఏపీని మార్చారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు రాయలసీమ కార్యకర్తలు పౌరుషంగా బయటకు రావాలని, రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు నడుం బిగించాలని, ఎవరు ఎదురొచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొని పోరాడాలని పిలుపు నిచ్చారు. 2024లో మన ప్రభుత్వం వచ్చిన వెంటనే యువతకు 20లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారన్నారు.

నిరుద్యోగులకు నెలకు రూ.3వేలు నిరుద్యోగ భృతి, రైతులకు సంవత్సరానికి రూ.20వేలు పెట్టుబడిసాయం, 18సంవత్సరాలు నిండిన ప్రతి మహిళలకు నెలకు రూ.1,500, చదువుకునే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి రూ.15వేలు, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సదుపాయం అందిస్తామని చంద్రబాబు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మహిళలు కూడా తమ వంతు తెలుగుదేశంపార్టీ విజయానికి కృషి చేయాలి అని భువనేశ్వరి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement