Sunday, April 28, 2024

ప్రజా సేవలను క్షేత్ర స్థాయిలో ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

తిరుపతి సిటీ, ఏప్రిల్ 22 (ప్రభ న్యూస్) : తిరుపతి రూరల్ పరిధిలోని వెంకటపతి నగర్ విలేజ్ హెల్త్ క్లినిక్, అంగన్వాడీ కేంద్రాన్ని, గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి సందర్శించి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచికలపై, అసంక్రమిత, సంక్రమిత వ్యాధుల ఫాలోఅప్, అంగన్వాడి సేవలు, రక్తహీనత, గర్భిణీ స్త్రీల, క్యాన్సర్ పేషంట్ల ఫాలో అప్ పై సమీక్షించి, మంచానికే పరిమితమైన రోగుల గృహ సందర్శన చేసి సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు. శనివారం ఉదయం తిరుపతి రూరల్ వెంకటపతి నగర్ లోని విలేజ్ హెల్త్ క్లినిక్ ను ముందుగా కలెక్టర్ సందర్శించి వాటి పరిధిలోని గర్భిణీ స్త్రీలు, కౌమార దశలోని అమ్మాయిలు అనీమియాతో బాధపడుతున్న వారి వివరాలు ఏఎన్ఎం ను అడిగి తెలుసుకున్నారు. అలాగే అక్కడ ఉన్న గర్భిణీ స్త్రీలతో కలెక్టర్ మాట్లాడుతూ… పౌష్టికాహారం తీసుకుని ఆరోగ్యంగా ఉంటే వారికి పుట్టబోవు పిల్లలు ఆరోగ్యంగా పుడతారని, ప్రభుత్వం నుండి అందిస్తున్న వైయస్సార్ సంపూర్ణ పోషణ, ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లను సద్వినియోగం చేసుకొని, ఆస్పత్రుల్లో సురక్షిత కాన్పులు జరిగేలా ఉండాలని తెలిపారు. ఏఎన్ఎం వివరిస్తూ క్లినిక్ పరిధిలో 29 మంది బాలింతలు ఉన్నారని అందులో 19 మంది మద్యస్థ రక్తహీనతతో బాధపడుతున్నారని వారికి క్రమం తప్పకుండా పరీక్షలు చేసి ఐ ఎఫ్ ఏ మందులు అందిస్తున్నామని తెలిపారు. సరైన డేటా అందుబాటులో ఉంచుకుని క్రమం తప్పకుండా వారికి దాతల సహకారంతో పౌష్టికాహారం అందిస్తే ఆరోగ్య సమస్యల నుండి పిల్లలు బయటపడతారని చదువుపై దృష్టి పెట్టగలరని మంచి భవిష్యత్తు వారికి కల్పించిన వారమవుతామని నిబద్దతతో అంకితభావంతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బందికి సూచించారు.

విద్యా హక్కు చట్టం కింద ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో సచివాలయ పరిధిలో నలుగురికి ఒకటవ తరగతిలో సీట్లు కేటాయింపు జరిగిందని సచివాలయ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ తెలుపగా ఇరువురు పిల్లలతో కలెక్టర్ మాట్లాడుతూ… మంచిగా చదువుకోవాలని ఆశీర్వదించారు. గృహ సందర్శనలో మాత శిశు సంరక్షణ వివరాలను గృహిణిని అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో వారి ఆరోగ్య స్థితిగతులపై సరియైన పూర్తిస్థాయి ప్రశ్నావళితో కౌన్సిలింగ్ నిర్వహిస్తే ప్రజల ఆరోగ్యంపై పూర్తి సమాచారంతో వారికి నిర్వహించాల్సిన పరీక్షలు, కావాల్సిన మందులపై అవగాహన వస్తుందని, దీని వలన రోగాలను ముందుగానే గుర్తించి రోగం ముదరకుండానే వారికి మందులతో నయం చేసే విధంగా వారి ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళమవుతామని, ఆ దిశలో పనిచేయాలని సూచించారు. అలాగే పక్షవాతంతో, డయాబెటిస్, రక్తపోటు వంటి వ్యాధితో బాధపడుతున్న వారి గృహ సందర్శన చేసి 104 సేవలు వినియోగంపై ఆరా తీసారు. అలాగే హౌసింగ్ కు సంబంధించి తొండవాడ లేఔట్ లబ్ధిదారులతో ఇంటి పురోగతిపై ఆరా తీయగా.. వారు ఇంటి నిర్మాణం త్వరలోనే పూర్తి చేస్తున్నామని తెలిపారు. అలాగే గ్రామంలో పారిశుధ్యాన్ని పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ ప్రాధాన్యత భవనాల నిర్మాణ తనిఖీల్లో భాగంగా తిరుపతి రూరల్ వెంకటపతి నగర్ గ్రామ సచివాలయాన్ని సందర్శించారు. సచివాలయం ప్రారంభానికి అన్ని విధాలా సిద్ధంగా ఉందని సర్పంచ్ సుబ్రహ్మణ్య యాదవ్ కలెక్టర్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.శ్రీహరి, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి జయలక్ష్మి, డి ఎల్ డి ఓ లు సుశీల దేవి, ఆదిశేష రెడ్డి, అదనపు సిడిపిఓ జ్యోతి తిరుపతి రూరల్ తాసిల్దార్ ఎంపీడీవో తదితర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement