Sunday, May 5, 2024

Big Story | మారుతున్న రాజకీయ సమీకరణాలు.. పట్టు బిగిస్తున్న విపక్షాలు

అమరావతి, ఆంధ్రప్రభ : ఏపిీ రాజకీయం ముఖచిత్రం మారుతోంది. రాజకీయ సమీకర ణాలు వేగంగా మారిపోతున్నాయి. అధికార వైసీపీని ఓడించడమే లక్ష్యంగా విపక్షాలు వ్యూహాలను రచిస్తూ ఎన్నికల కార్యాచరణను సిద్దం చేస్తున్నాయి.రానున్న ఎన్నికల్లో పొత్తులతో బరిలోకి దిగి వైసీపీని ఎలాగైనా గద్దె దింపాలన్న లక్ష్యంతో వేగంగా అడుగులు వేస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ గడిచిన రెండేళ్ళుగా వివిధ కార్యక్రమాలతో ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర పడ టంతో టీడీపీ లో కలిసి నడిచేందుకు జనసేన, బిజేపీలు ఒక ప్రాధమిక నిర్ణయానికి వచ్చాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన మధ్య చర్చలు జరుగుతుండగా వీరితో జతకట్టేందుకు బీజేపీ కూడా దాదాపు సిద్దమైంది.

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ , టీడీపీ అధినేత చంద్రబాబులు ఇటీవల కాలంలో మూడు సార్లు వరస బేటీలు నిర్వహించడం రాష్ట్ర రాజకీయాలను వేడేక్కించాయి. ఇక ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లిలో బీ జేపీ అగ్రనేత హోంమంత్రి అమిత్‌ షాతో ఏకాంతంగా సమావేశం కావడం ఈ కాకను మరింత పెంచింది. మహానాడు వేదిక భవిష్యత్‌ కు గ్యారెంటీ పేరిట మినీ మ్యానిఫెస్టోను ప్రకటించి టీడీపీ ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. తాజాగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కూడా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. వారాహి యాత్ర ను లాంచనంగా ప్రారంభించారు. పొత్తులపై అధికారిక ప్రకటనను ఈ మూడు పార్టీలు చేయకపోయినా దాదాపు పొత్తులు ఖరారయినట్టుగానే రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

- Advertisement -

ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు మూడు పార్టీల పొత్తుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఈ రెండు పార్టీలతో కలిసి నడిచేందుకు బీజేపీ కూడా సిద్దమైంది. రాష్ట్రంలో బీజేపీ అగ్రనేతలు, కేంద్ర మంత్రులు తరచూ పర్యటిస్తూ పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. తాజాగా బీజేపీ అగ్రనేత అమిత్‌ షా విశాఖ వేదికగా అధికార వైసీపీ పై తీవ్ర స్దాయిలో విమర్శలు గుప్పించారు. మరో వైపు ఇప్పటికే తెలంగాణాలో బస చేసిన ఆయన ఖమ్మంలో ఎన్టీఆర్‌ కు నివాళులు అర్పించనున్నారు. ఈ సంకేతాలన్ని టీడీపీ తో పొత్తులను స్పష్టం చేస్తున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

వచ్చే నెలలో పొత్తులపై అధికారిక ప్రకటన.. ?

ఇదిలా ఉంటే విపక్షాల పొత్తులపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి. వచ్చే నెల మొదటి వారంలో బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తులపై క్లారిటీకి రానున్నాయి. ఈ నెలాఖరులో టీడీపీ అధినేత చంద్రబాబు మరో సారి బీజేపీ అగ్రనాయకత్వంతో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా విశ్వసనీయ సమాచారం. అలాగే పవన్‌, చంద్రబాబులు కూడా భేటీ అయ్యి ఒక అవగాహనకు రానున్నారు. ఈ భేటీలు పూర్తి అయిన అనంతరం మూడు పార్టీల జాయింట్‌ సమావేశం ఉంటుందని రాజకీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

సీట్ల సర్దుబాటు ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చిన అనంతరం ఈ మూడు పార్టీలు ఇక పూర్తి స్దాయి ఎన్నికల కార్యాచరణను ఉమ్మడిగా ప్రారంభించనున్నాయి. అధికార పార్టీ ప్రస్తుతం అందిస్తున్న సంక్షేమానికి ధీటుగా ఉమ్మడి ప్రణాళికను ప్రకటించనున్నాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు భవిష్యత్‌ కు గ్యారెంటీ పేరిట మహిళలు, యువత, రైతులకు సంక్షేమ తాయిలాలను ప్రకటించారు. అంతేకాకుండా రెట్టింపు సంక్షేమ హామీతో దసరా నాటికి పూర్తి స్ధాయి మ్యానిఫెస్టోను ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ మూడు పార్టీలు తమ ప్రత్యర్ధి అయిన అధికార వైసీపీ మట్టికరిపించి ఎలాగైనా అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement