Monday, April 29, 2024

తమ్ముళ్లూ వస్తున్నా: 4వ తేదీ నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటన.. శ్రీకాకుళం జిల్లాలో ఫ‌స్ట్ టూర్

అమరావతి, ఆంధ్రప్రభ : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించిన టూర్‌ షెడ్యూల్‌ను సోమవారం ఖరారు చేశారు. ఈ నెల 4వ తేదీ నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటన ప్రారంభం కానుంది. ఇప్పటికే పన్నుల భారం, విద్యుత్‌ కోతలు, బస్సు, విద్యుత్‌ ఛార్జీల పెంపుతో పార్టీ ఆధ్వర్యంలో బాదుడే – బాదుడు నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. జిల్లాల పర్యటనలో భాగంగా చంద్రబాబు ఈ నిరసన కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొని కేడర్‌లో జోష్‌ను నింపనున్నారు. ఈ నెల 4వ తేదీన శ్రీకాకుళం జిల్లా నుంచి తన పర్యటనను ప్రారంభించనున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గం దల్లా వలస గ్రామంలో చంద్రబాబు పర్యటన జరగనుంది.

5వ తేదీన భీమిలీ నియోజకవర్గం తాళ్లవలస, 6వ తేదీన ముమ్మడివరం నియోజకవర్గం కోరింగలో చంద్రబాబు పర్యటిస్తారు. అలాగే మిగిలిన జిల్లాల్లో కూడా వరుస పర్యటనలు నిర్వహించేందుకు అవసరమైన ప్రణాళికలను పార్టీ రూపొందిస్తోంది. తొలుత ఈ మూడు ప్రాంతాల్లో పర్యటన సాగనుంది. ఈ నెల 27న మహానాడు నిర్వహించనున్న నేపథ్యంలో అప్పటివరకు చంద్రబాబు పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆయన సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లా కుప్పంలో కూడా చంద్రబాబు పర్యటన త్వరలోనే జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పార్టీ యంత్రాంగం చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement