Saturday, May 4, 2024

సుప్రీం కోర్టులో చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ శుక్ర‌వారానికి వాయిదా

ఢిల్లీ: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. సీఐడీ తనపై నమోదు చేసిన కేసు కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

అంతకు ముందు చంద్రబాబు తరపున హరీశ్ సాల్వే, సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. విచారణ సందర్భంగా ఇరువురూ భిన్నమైన వాదనలను వినిపిస్తున్నారు. 17ఏ చుట్టూనే వాదనలు కొనసాగాయి. 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందని కోర్టుకు సాల్వే తెలిపారు. చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా 17ఏ కాపాడుతుందని చెప్పారు. ఇదే విషయాన్ని నిన్న కూడా తాను చెప్పానని అన్నారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక ప్రశ్న వేసింది. 17ఏ అనేది ప్రొసీజర్ అన్నప్పుడు… అది హక్కుగా వర్తిస్తుందా? అని ప్రశ్నించింది. వాదనలకు ఇంకా ఎంత సమయం తీసుకుంటారని సాల్వేను ధర్మాసనం ప్రశ్నించింది. మరో గంట కావాలని కోర్టును సాల్వే కోరారు.

దీంతో ముకుల్ రోహత్గీ కలగజేసుకుని ఇంకా ఎంతసేపు యువరానర్ ఇప్పటికే మూడు రోజులుగా వెయిట్ చేస్తున్నాం అని చెప్పారు. మీరు గంట అవకాశం ఇస్తే తాను గంట తర్వాతే వస్తానని తెలిపారు. దీనిపై నోటీసులు ఇవ్వాలని ఆ నోటీసులకు కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారు.

- Advertisement -

దీనికి సమాధానంగా సాల్వే మాట్లాడుతూ… ఇదొక క్రిమినల్ కేసు అని, కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. తనకు అవకాశం ఇస్తే, తాను రిఫరెన్స్ తీర్పులను తమ ముందు ఉంచుతానని, నిందితులకు రక్షణ కల్పించిన కేసులను ఉదహరిస్తానని చెప్పారు. మరోవైపు ధర్మాసనం స్పందిస్తూ హైకోర్టుకు సీఐడీ సమర్పించిన డాక్యుమెంట్ల ఆధారంగానే ఇక్కడ విచారణ జరుగుతోందని వ్యాఖ్యానించింది. కొత్తగా నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఆ త‌ర్వాత సిఐడి న్యాయ‌వాది కూడా త‌న వాద‌న‌లు వినిపించారు.. అనంత‌రం ఈ కేసు విచార‌ణ‌ను శుక్ర‌వారానికి వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement