అమరావతి, ఆంధ్రప్రభ: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో రోజురోజుకు చోటు చేసుకుంటున్న అనూహ్య పరిణామాల నేపధ్యంలో సీబిఐ మరింత మూలాల్లోకి వెళుతోంది. దీనిలో భాగంగా మంగళవారం అధికారులు బహుముఖ దర్యాప్తు కొనసాగించారు. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్పై తెలంగాణా హైకోర్టు నేటికి వాయిదా వేసిన నేపధ్యంలో ప్రతి అంశాన్ని లోతుగా విశ్లేషిస్తోంది. దర్యాప్తుపై ఎలాంటి ఆరోపణలు దరి చేరకుండా జాగ్రత్త పడుతూనే ఆరోపణలు ఎదుర్కొం టున్న నిందితుల కోణంలో కూడా విచారణలో ముందుకెళ్తోంది. దీనిలో భాగంగానే వివేకా అల్లుడు రాజశేఖర్ను మరోమారు ప్రశ్నించారు. ఈ సారి అల్లుడుతోపాటు వివేకా కుమార్తె సునీత కూడా సీబిఐ విచారణకు వచ్చారు.
హైదరాబాద్లో వీరిద్దరినీ ఓ బృందం ప్రశ్నిస్తుంటే , మరో బృందం తెలంగాణా హైకోర్టులో అవినాష్ ముందస్తు బెయిల్ విచారణకు హాజరైంది. అదేవిధంగా ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ విచారణపై కూడా అధికార బృందం దృష్టి పెట్టింది. అంతేకాకుండా కేసులో కీలకమైన అప్రూవర్ దస్తగిరి భద్రతకు సంబంధించి అనుమానాలు రెకేత్తుతున్న నేపధ్యంలో ఓ బృందం పులివెందులలోని అతని ఇంటికెళ్ళింది. అలాగే ఎంపీ అవినాష్ రెడ్డి పులివెందుల చేరుకున్న క్రమంలో అటువైపూ ఓ కన్నేసిన సీబి ఐ తమ నిఘా వర్గాలను అప్రమత్తం చేసింది. దీనిలో భాగంగా అక్కడే మరికొంత మంది అధికారులు మకాం వేసి అక్కడి పరిస్ధితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. దీంతో అవినాష్ను అరెస్టు చేయవచ్చనే ప్రచారం ఉూపందుకోవడంతో అక్కడి రాజకీయ పరిస్ధితులు, తాజా స్ధితిగతులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తోంది. మరోవైపు ఈ కేసులో తొలుత నుంచీ విచారించిన సాక్షులను మరలా పిలుపించుకుని తాజా పరిస్ధితులు, సమాచారానికి అనుగుణంగా విచారణ చేపట్టింది. మొత్తం మీదట సుప్రీం తాజా ఆదేశాలతో దూసుకెళ్తున్న సీబి ఐ మంగళవారం వరుస పరిణామాల నడుమ బహుముఖ విధానాన్ని అనుసరిస్తూ బిజీ బిజీగా మారింది.
అవినాష్ ముందస్తుపై వాయిదా..
వివేకా హత్య కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ వైఎస్ అవినాష్రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్పై విచారణను తెలంగాణా హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. కేసు విచారణ ఉదయం ధర్మాసనం ముందుకు రాగా సుప్రీం కోర్టు ఆర్డర్ కాపీ ఇంకా అందలేదని అవినాష్ తరపు లాయర్ కోర్టుకు తెలిపారు. దీంతో ఆర్డర్ కాపీ చూసిన తర్వాతే తీర్పు చెబుతామని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ తర్వాత మధ్యాహా ్నం నాటికి సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీ అందడంతో విచారణ చేపట్టాల్సిందిగా అవినాష్ లాయర్ కోర్టును కోరారు. దీంతో దీనిపై వాదనలు బుధవారం వింటామని న్యాయమూర్తి వాయిదా వేశారు. ఈనెల 25 వరకు అవినాష్రెడ్డిని అరెస్ట్ చేయొద్దని గత విచారణలో సీబిఐని హైకోర్టు ఆదేశించి ంది. దీనిపై వివేకా కుమార్తె సునీత సుప్రీం కోర్టును ఆశ్రయించగా మధ్యంతర బెయిల్ రద్దయింది. ముందస్తుపై హైకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. ఈక్రమంలో బుధవారం జరిగే విచారణలో వెలువడే కోర్టు నిర్ణయం సీబిఐకి అనుకూలంగా ఉంటుందా లేక అవినాష్కు బెయిల్ మంజూరవుతుందా అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే నేటి విచారణను రేపటికి వాయిదా వేసింది హైకోర్టు
గంగిరెడ్డి బెయిల్ రద్దుపై వాయిదా..
అదేవిధంగా వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడైన ఎర్ర గంగిరెడ్డి ప్రస్తుతం బెయిల్పై బయట ఉన్నాడు. కాగా గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని గతంలో సీబిఐ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై మంగళవారం విచారణ జరిగింది. గంగిరెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. మరోవైపు బెయిల్ రద్దుకు బలమైన కారణాలేమీ లేవ ంటూ గంగిరెడ్డి తరఫు న్యాయవాది వాదించారు. ఇరుపక్షాల వాదనల అనంతరం ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ బుధవారానికి న్యాయమూర్తి వాయిదా వేశారు.
మరోసారి సీబిఐ కార్యాలయానికి రాజశేఖర్..
మరోసారి సీబిఐ కార్యాలయానికి వివేకా అల్లుడు రాజశేఖర్రెడ్డి వచ్చారు. ఆయన వెంట సునీత రెడ్డి కూడా హాజరయ్యారు. ఇప్పటికే రాజశేఖర్ను గత శనివారం అధికారులు విచారించారు. అవసరమైతే మరోసారి రావాలని చెప్పడంతో సీబిఐ ఆదేశాలతో భార్య సునీతతో కలిసి సాయంత్రం కార్యాలయానికి వచ్చారు. దాదాపు రెండు గంటలకు పైగా వీరిద్దరిని విచారించిన అధికారులు వివేకా హత్య తర్వాత పరిణామాలపై ప్రశ్నించినట్లు తెలిసింది. వివేకా హత్య కేసులో ఘటన స్ధలంలో లభించిన లేఖ కీలకమని, దాని గురించి అల్లుడు రాజశేఖర్ను ఎందుకు ప్రశ్నించడం లేదంటూ అవినాష్ రెడ్డి మొదటి నుం చీ డిమాండు చేస్తున్నాడు. దీంతో రాజశేఖర్ దంపతులను మరలా లేఖ గురించి వివరాలు అడిగిన అధికారులు లేఖను సాయంత్రం వరకు ఎందుకు దాచిపెట్టారని ప్రశ్నించినట్లు సమాచారం. వివేకా రెండో వివాహం, కుటుంబ విభేదాలు, హత్యకు సంబంధించిన సమాచారం ఎలా తెలిసింది తదితర అంశాలపై ప్రశ్నించినట్లు సమాచారం. వీరిద్దరి నుంచి సేకరించిన సమాచారం మేరకు మరికొంతమందికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పులివెందులకు అవినాష్ రెడ్డి..
అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై తెలంగాణా హైకోర్టులో బుధవారానికి వాయిదా పడటంతో కడప ఎంపీ అవినాష్రెడ్డి హైదరాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నానానికి పులివెందులకు చేరుకున్నారు. ఎంపీ అనుచరులు పెద్ద ఎత్తున పులివెందులకు తరలివచ్చారు. కాగా అనుచరులతో కీలక సమావేశాలు నిర్వహించనున్నట్లు-గా వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. స్ధానిక సమస్యలపై ప్రజలతో కలిసి ప్రజాదర్భార్ నిర్వహించారు. ఇదిలావుండగా సీబీఐ అరెస్ట్ చేస్తే ఎలాంటి వ్యూహం అవలంభించాలన్నదానిపై అవినాష్రెడ్డి చర్చలు జరిపే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. దీనికి తోడు సీబీఐ అధికారులు కూడా పులివెందులలోనే మకాం వేయడంతో ఆయా వర్గాల్లో టెన్షన్ కొనసాగుతోంది.
దస్తగిరి భ ద్రతపై సీబి ఐ దృష్టి..
వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారి దర్యాప్తులో కీలకసాక్షిగా ఉన్న దస్తగిరి భ ద్రతపై సీబిఐ దృష్టి పెట్టింది. కేసు కీలక దశకు చేరుకుంటున్న క్రమంలో అవినాష్ బెయిల్పై ఉత ్తర్వులు రానున్న నేపధ్యంలో దస్తగిరి రక్షణ ప్రశ్నార్ధకమైంది. దీంతో పులివెందులకు వచ్చిన అధికారులు దస్తగిరి ఇంటికి వచ్చి అతని భద్రతపై ఆరా తీశారు. అవినాష్, జగన్తో తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ ఇటీవల ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో భద్రత పెంచారు. ఈక్రమంలో వివరాలు తెలుసుకున్న సీబిఐ ఏదైనా సమస్య వచ్చినా, కొద్దిపాటి అనుమానం కలిగినా వెంటనే తెలియజేయాలని దస్తగిరికి సూచించారు. ఈ కేసు విచారణలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
ఉదయ్పై ఆరా..
కాగా కీలక నిందితునిగా భావిస్తున్న ఉదయ్కుమార్ రెడ్డి గురించి మరింత ఆరా తీస్తోంది. ఆరు రోజుల పాటు కస్టడీలో విచారించిన అధికారులు గడువు ముగియడంతో చం ఛల్ గూడకు తరలించారు. అయితే స్ధానికంగా ఉదయ్ కార్యకలాపాలు ఎలా ఉండేవన్న కోణంలో ఆరా తీస్తోంది. ఉదయ్ ఐదేళ్ల పాటు పని చేసిన యుసీఐఏ కంపెనీ మేనేజర్ను కలిసి వివరాలు సేకరించారు. వివేకా హత్య జరిగిన రోజు ఉదయ్ డ్యూటీలో ఉన్నాడా లేదా అని ఆరా తీసింది.