భాకరాపేట: ఏపీలోని చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలో శనివారం రాత్రి ధర్మవరం నుండి తిరుపతి వెళు తున్న ప్రైవేట్ బస్సు అదుపు తప్పి భాకరాపేట ఘాట్ లోయలో పడిన ఘటన దురదృష్టకరమని జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ తెలిపారు. సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకొని పరిస్థితులను సమీక్షిస్తూ సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా సహాయక చర్యలను తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు పర్యవేక్షిస్తున్నారు. క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలిస్తున్నారు.
అర్ధరాత్రి అరుపులు, కేకలతో దద్దరిల్లిన అటవీ ప్రాంతం..
కాగా, 50 అడుగుల లోతులో బస్సు పడిపోవడంతో బస్సులో ఉన్నవాళ్లంతా ఒకరిపై ఒకరు పడిపోయారు. దీంతో చాలామందికి కాళ్లు, చేతులు విరిగిపోయాయి. మరికొందరు నెత్తుటి మడుగులో కొట్టుమిట్టాడుతున్నారు. అడవిలో అర్ధరాత్రి వేళ ఆర్థనాలు, అరుపులు, కేకలతో బాకారాపేట ఘాట్ దద్దరిల్లిపోతోంది. లోయలోనుంచి బయటికి తీసిన వారిని వెంటవెంటనే పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎంత మంది చనిపోయారు అనే విషయంపై ఇంకా క్లారిటీ రావడం లేదు.