Wednesday, May 15, 2024

ప్రభుత్వం సున్నా వడ్డీ చెల్లింపుతో రుణాలివ్వడానికి బ్యాంకులు రెడీ

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో మూడేళ్లుగా అన్నదాతలకు పుష్కలంగా వ్యవసాయ రుణాలు మంజూరవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీని క్రమం తప్పకుండా చెల్లిస్తుండటంతో రైతులకు అవసరమైన వ్యవసాయ రుణాలను బ్యాంకులు విరివిగా మంజూరుచేస్తున్నాయి. ఏడాదికేడాదికి రైతుల సంఖ్యతోపాటు రుణాల మంజూరులో పెరుగుదల కనిపిస్తోంది. గడచిన మూడేళ్లలో అంటే 2019-20 ఆర్ధిక సంవత్సరం నుండి 2021-22 ఆర్ధిక సంవత్సరం వరకూ 307.20 లక్షల మంది రైతులకు రూ. 4,37,828 కోట్ల వ్యవసాయ రుణాలను బ్యాంకులు మంజూరుచేశాయి. ఈ ఏడాది ఖరీఫ్‌లో వ్యవసాయ రుణాల మంజూరు లక్ష్యం రూ. 97,197 కోట్లు కాగా, ఇప్పటి వరకూ రూ. 85,346 కోట్ల రుణాలను 48.49 లక్షల మంది రైతులకు బ్యాంకులు మంజూరు చేశాయి.

కౌలు దారులకు పంట సాగు హక్కు చట్టం

మరోపక్క రాష్ట్రంలో కౌలు సాగు దారులకు కూడా బ్యాంకు రుణాలు మంజూరు చేయించడానికి రాష్ట్ర ప్రభుత్వం పంట సాగుదారుల హక్కుల చట్టం – 2019ను తీసుకొచ్చింది. ఈ చట్టం కింద పంట సాగుదారుల హక్కు పత్రాలు పంపిణీ చేస్తోంది. వాస్తవ సాగుదారులకు సీసీఆర్‌సీ పత్రాలు జారీ చేయడంతో బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తున్నాయి. కౌలు రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించడానికి ఆర్బీకేల్లోని సిబ్బంది సహకరిస్తున్నారు. ఇప్పటి వరకూ 4.75 లక్షల మంది కౌలు రైతులకు రూ. 3,595.02 కోట్ల మేర బ్యాంకు రుణాలు మంజూరు చేశాయి. వీలైనంత ఎక్కువ మంది కౌలు రైతులకు రుణాలు మంజూరు చేయించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. బ్యాంకర్ల సమావేశాల్లో ఈ విషయంపై సీఎంతో పాటు జిల్లా కలెక్టర్లు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. గత సర్కారు రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పడంతో ప్రభుత్వం చెల్లిస్తుందన్న ధీమాతో రైతులు చెల్లించకపోవడంతో అవి ఎన్‌పీఏలుగా మారాయి. దీంతో రైతులు రుణాలు పొందేందుకు పలు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈక్రమంలోనే వైసీపీ అధికారంలోకి రాగానే ఆపరిస్థితి పూర్తిగామార్చేసి రైతులకు మేలుచేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటుండటంతో బ్యాంకులు కూడా రైతులకు రుణాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి.

రుణాల మంజూరు ఇలా

- Advertisement -

సంవత్సరం – రుణ మొత్తం(కోట్లలో) – రైతుల సంఖ్య
2019-20 – రూ. 1,13,998 – 94,47,136
2020-21 – రూ. 1,46,876 – 1,05,92,984
2021-22 – రూ. 1,76,954 – 1,06,80,256
2022-23 ఖరీఫ్‌ – రూ. 85,346 – 48,49,808

Advertisement

తాజా వార్తలు

Advertisement