Friday, April 26, 2024

ఉద్యోగులు పిట్టల్లా రాలిపోతున్నారు. వర్క్ ఫ్రం హోం ఇవ్వండి!

కరోనా బారినపడి ఏపీ సచివాలయంలో పలువురు ఉద్యోగులు మృతి చెందిన సంగతి తెలిసిందే. పదుల సంఖ్యలో ఉద్యోగులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీనిపై అమరావతి ఉద్యోగుల జేఏసీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కరోనా కారణంగా ఉద్యోగులు చనిపోతున్నారని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వర్క్ ఫ్రం హోం సదుపాయం ఇవ్వాలని జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. సచివాలయంలో 8 మంది ఉద్యోగులు కరోనాకు బలయ్యారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఉద్యోగుల్లో భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. కరోనా సోకిన ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని పేర్కొన్నారు.

కరోనా పాజిటివ్ ఉద్యోగులకు ఆసుపత్రుల్లో ప్రత్యేక సదుపాయం కల్పించాలని తెలిపారు. తక్షణమే కరోనా బారిన పడిన ఉద్యోగులకు 14 నుండి 30 రోజుల వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయలని డిమాండ్ చేశారు. సెకండ్ వేవ్ ఉధృతి కారణంగా ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు కూడా రోజు రోజుకి ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగిని ఒక వ్యక్తిగా చూడొద్దని, ఒక కుటుంబంగా చూడాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉద్యోగులకు, వారి కుటుంబాలకు కొంత ధైర్యం, భరోసా కలిగించే చర్యలు చేపట్టాలని బొప్పరాజు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement