Friday, March 29, 2024

భారత్‌లో జూలై వరకు వ్యాక్సిన్ కొరత: ISB

130 కోట్ల భారత దేశంలో ఇప్పటివరకు కరోనా వ్యాక్సిన్ పొందినవారి సంఖ్య 15 కోట్లు మాత్రమే ఉంటుంది. అయితే మే 1 నుంచి 18 ఏళ్లకు పైబడిన వారికి కూడా వ్యాక్సినేషన్ అంటూ కేంద్రం ప్రకటించినా.. అందుకు తగ్గ వ్యాక్సిన్ నిల్వలు లేకపోవడంతో సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. దీనిపై ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) స్పందించింది. జూలై వరకు భారత్‌లో కరోనా వ్యాక్సిన్ల కొరత తప్పదని పేర్కొంది. 18 ఏళ్లు నిండిన వారికి కూడా కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం ప్రకటించినా, ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్ నిల్వలు అందుకు ఏమాత్రం సరిపోవని స్పష్టం చేసింది.

ఇటీవలే నీతి ఆయోగ్‌కు సమర్పించిన నివేదికలో ఐఎస్‌బీ ఈ మేరకు వెల్లడించింది. ఈ నివేదిక రూపకల్పనలో ఐఎస్‌బీ ప్రొఫెసర్ సారంగ్ దేవ్, ప్రొఫెసర్ శ్రీపాద్ దేవాల్కర్, రీసెర్చ్ అసోసియేట్లు అభిషేక్ రెడ్డి, సయ్యద్ జునైద్ ముఖ్యపాత్ర పోషించారు. జూలై చివరి వరకు అనేక రాష్ట్రాలు కరోనా వ్యాక్సిన్ కొరతను ఎదుర్కొంటాయని ఐఎస్ బీ తన నివేదికలో వివరించింది. ఏప్రిల్ 29 నాటికి 15 కోట్ల వ్యాక్సిన్ డోసులు వినియోగించగా 1.3 కోట్ల డోసులే మిగిలున్నాయని తెలిపింది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ సాధారణంగా ఉన్న సమయంలో రాష్ట్రాల వద్ద నిల్వలు గణనీయస్థాయిలోనే ఉన్నాయని, కానీ వ్యాక్సినేషన్ ఊపందుకోవడంతో రాష్ట్రాల వద్ద నిల్వలు తరిగిపోయాయని వివరించింది.

18 ఏళ్లు నిండినవారికి కూడా కరోనా వ్యాక్సిన్ అంటూ కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో అనేక రాష్ట్రాలు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే పలు చోట్ల రెండో డోసు ఇవ్వాల్సి ఉండగా ఉన్న నిల్వలు రెండో డోసు ఇచ్చేందుకు సరిపోతాయని, కొత్తగా తొలి డోసులు ఇవ్వాలంటే మరిన్ని వ్యాక్సిన్ డోసులు కావాలని రాష్ట్రాలు కేంద్రాన్ని కోరుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement