Sunday, April 28, 2024

Bheemla Nayak: అధిక ధరకు టికెట్లు అమ్మకం.. మంత్రులు ప్రారంభించిన థియేటర్‌కు భారీ జరిమానా

ఏపీలో పవన్ కల్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమాను ప్రభుత్వం టార్గెట్ చేసిందంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో భీమ్లానాయక్ సినిమా టికెట్లను అధిక ధరకు విక్రయించినట్టు ఆరోపణలపై కృష్ణా జిల్లా గుడివాడలోని జీ3 భాస్కర్ థియేటర్‌ కు భారీ జరిమానా విధించారు. జీ3 భాస్కర్ థియేటర్‌లో భీమ్లానాయక్ సినిమా టికెట్లను అధిక ధరకు విక్రయిస్తున్నట్టు ప్రేక్షకుల నుంచి ఫిర్యాదులు అందడంతో గుడివాడ ఆర్ఐ జాస్తి అరవింద్ థియేటర్‌లో తనిఖీలు నిర్వహించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ మాధవీలతకు నివేదికను పంపారు.

డైమండ్ కేటగిరీ టికెట్ ధర రూ. 70 అయితే దానిని రూ. 100 విక్రయిస్తున్నారని, అలాగే, పలు టికెట్లపై ధరలను ముద్రించలేదని ఆర్ఐ తెలిపారు. ఆర్ఐ అరవింద్ పంపిన నివేదికను పరిశీలించిన జేసీ మాధవీలత థియేటర్ యాజమాన్యానికి రూ. 50 వేల జరిమానా విధించారు. కాగా, ఈ థియేటర్‌ను మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని శుక్రవారమే ప్రారంభించిన సంగతి తెలిసిందే. థియేటర్ లో ప్రారంభ చిత్రంగా భీమ్లానాయక్ ను ప్రదర్శిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement