Sunday, April 28, 2024

AP CM: రెండో రోజు ఢిల్లీలో సీఎం బిజీ బిజీ.. గడ్కరీతో చర్చించిన అంశాలు ఇవీ..

ఢిల్లీలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పర్యటన కొనసాగుతోంది. రెండో రోజు బిజీ బిజీగా గడుపుతున్నారు. తొలుత కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీతో సీఎం జగన్‌ భేటీ అయ్యారు. దాదాపు గంటసేపు జరిగిన  సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో పలు జాతీయ రహదారులను మంజూరుచేసినందుకు కేంద్రమంత్రికి సీఎం ధన్యవాదాలు తెలిపారు. విశాఖపట్నం పోర్టు నుంచి రిషికొండ, భీమిలి మీదుగా భోగాపురం వరకూ జాతీయ రహదారి డీపీఆర్‌ తయారీ అంశంపై చర్చ జరిగింది.

ఈ సందర్భంగా విశాఖపట్నానికి ఈ రహదారి చాలా ఉపయోగమని, విశాఖపట్నం పోర్టు నుంచి ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ వెళ్లే సరుకు రవాణా వాహనాలకు తక్కువ దూరం అవుతుందని సీఎం తెలిపారు. సముద్ర తీరాన్ని ఆనుకుని బీచ్‌ కారిడర్‌ ప్రాజెక్టులకు సమీప నుంచి ఈ రోడ్డు వెళ్తుందని చెప్పారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేరుకునేందుకు, ఈ ప్రాంతంలో పర్యాటకరంగం అభివృద్ధికి ఈ రోడ్డు నిర్మాణం అత్యంత దోహపడుతుందని వివరించారు. అలాగే, విశాఖ నగరంలో వాహనరద్దీని దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా 6 లేన్ల రహదారిని కేంద్రమంత్రి గడ్కరీని సీఎం జగన్ కోరారు.

విజయవాడ తూర్పు బైపాస్‌పై గతంలో చేసిన విజ్ఞప్తిని చురుగ్గా పరిశీలించాలని విన్నవించారు. సంబంధిత శాఖల సమన్వయంతో భూ సేకరణను వీలైనంత త్వరగా పూర్తిచేస్తామన్న సీఎం.. ప్రాజెక్టు ఖర్చు తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఎస్జీఎస్టీ, రాయల్టీ మినహాయింపులిస్తామని ప్రకటించారు. వీలైనంత త్వరగా ప్రాజెక్టు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కత్తిపూడి- ఒంగోలు కారిడర్‌లో భాగంగా ఎన్‌హెచ్‌–216 నిర్మాణానికి సంబంధించి బాపట్లలో 4 లేన్ల రోడ్డుగా విస్తరించాలని కోరారు.– విద్యాసంస్థలు, పర్యాటకులు, ఎయిర్‌బేస్‌ కారణంగా మళ్లీ ట్రాఫిక్‌ జామ్స్‌ ఏర్పడే అవకాశం ఉందని, ప్రస్తుతం బాపట్ల ద్వారా వెళ్తున్న రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించాలంటూ విజ్ఞప్తి చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement