న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆక్వా ఉత్పత్తుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. గ్రామస్థాయిలో మత్స్య సంపదను మార్కెట్ చేయడం కోసం హబ్ అండ్ స్పోక్ మోడల్ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని వైఎస్సార్సీపీ ఎంపీ బ్రహ్మానందరెడ్డి లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ అండ్ డైరీయింగ్ శాఖ మంత్రి పురుషోత్తం రూపాల సమాధానమిచ్చారు. రాష్ట్రంలోని నలుమూలలా అన్ని జిల్లాల్లో చేపలను అందుబాటులో ఉంచుతోందని చెప్పారు. రూ. 20,050 కోట్ల బడ్జెట్తో ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని కేంద్రం అమల్లోకి తెచ్చిందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
ఈ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 655.38 కోట్ల పనులకు ప్రతిపాదనలు అందించిందని తెలిపారు. ఇందులో కేంద్రం ఇప్పటికే రూ. 104.79 కోట్లు విడుదల చేసిందని వివరించారు. పథకం కింద నదుల్లో మత్స్య సంపద కోసం దేశవ్యాప్తంగా ప్రతిపాదనలు కోరామని, ఏపీ నుంచి ఈ మేరకు ఎలాంటి ప్రతిపాదన అందలేదని పురుషోత్తం రూపాల వెల్లడించారు.