Saturday, May 4, 2024

Andhra Pradesh – 15 నుంచి సముద్రంలో చేపల వేట నిషేధం..

అమరావతి – సముద్ర జలాల్లో ఈ నెల 15 నుంచి జూన్‌ 14 తేదీ వరకూ చేపల వేటను నిషేధిస్తూ పశుసంవర్థక, డెయిరీ డెవలప్‌మెంట్‌, మత్స్య శాఖలు బుధవారం ఉత్తర్వులు జారీ చేశాయని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మత్స్యశాఖాధికారి ఎన్‌.శ్రీనివాసరావు తెలిపారు. యాంత్రిక పడవలు, మేకనైజ్‌డ్‌, మోటారు బోట్ల ద్వారా జరిగే అన్ని రకాల చేపల వేటను 61 రోజుల పాటు నిషేధించారన్నారు.

సంతానోత్పత్తి కాలంలో తల్లి చేపలు, రొయ్యలను సంరక్షించడం, వాటి సంతతి పెరుగుదలను ప్రోత్సహించడం ద్వారా మత్స్య సంపదను పెంపొందించేందుకు ఈ నిషేధం విధించారని తెలిపారు. ఈ మేరకు మత్స్య కారులు సహకరించాలని కోరారు. నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించిన బోట్ల యజమానులకు ఆంధ్రప్రదేశ్‌ సముద్ర మత్స్య క్రమబద్ధీకరణ చట్టాన్ని అనుసరించి శిక్ష పడుతుందన్నారు. అలాగే బోట్లు, మత్స్య సంపదను స్వాధీనం చేసుకుని జరిమానా విధిస్తారన్నారు. చేపలవేట నిషేధం సక్రమంగా అమలయ్యేందుకు మత్స్య శాఖ, కోస్ట్‌ గార్డ్‌, కోస్టల్‌ సెక్యూరిటీ పోలీసులు, నేవీ, రెవెన్యూ అధికారులతో గస్తీ ఏర్పాటు చేస్తామన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement