Wednesday, May 1, 2024

కోవిడ్ వ్యాక్సినేషన్ సురక్షితమైంది – అనంత కలెక్టర్

అనంతపురం, కోవిడ్ వ్యాక్సినేషన్ సురక్షితమైనదని, అపోహలు వీడి వ్యాక్సినేషన్ వేయించుకోవాలి కోసం ప్రజలు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. గురువారం అనంతపురం నగరంలోని అరవింద నగర్ లో ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ పరిధిలోని 48వ వార్డు సచివాలయం సమీపంలో శ్రీ కృష్ణదేవరాయ మునిసిపల్ స్కూల్ లో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, ఎంపీ గోరంట్ల మాధవ్ లు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 60 సంవత్సరాలు దాటిన 1.40 లక్షల మందికి వ్యాక్సిన్ వేశామని, 45 శాతం మందికి వ్యాక్సిన్ వేశామని, మిగిలిన వారికి 10 రోజుల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమంను చేపడతామన్నారు. హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లకు సంబంధించి 56 వేల మందికి వ్యాక్సినేషన్ వేశామన్నారు. వ్యాక్సినేషన్ పట్ల ఎలాంటి అపోహలు అవసరం లేదని, తాను కూడా కోవిడ్ వ్యాక్సినేషన్ వేసుకున్నానన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు వ్యాక్సినేషన్ వేయించుకున్నారని తెలిపారు. ఎటువంటి భయాలు అవసరం లేకుండా వ్యాక్సినేషన్ వేయించుకునేందుకు ముందుకు రావాలన్నారు.
కరోనా ప్రస్తుతం పెరుగుతోందని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, కోవిడ్ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రభుత్వం ఒక వ్యాక్సిన్ కోసం 206 రూపాయలు ఖర్చు చేస్తోందని, కోట్లాది రూపాయలు ఖర్చు చేసి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపడుతోందని, వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని సూచించారు. కరోనా అరికట్టడంలో ఇతర రాష్ట్రాల కంటే రాష్ట్రంలో విజయవంతం అయ్యామని, కరోనా కట్టడికి అందరూ కష్ట పడి పనిచేస్తున్నారన్నారు. 60 ఏళ్లు దాటిన వారు, 45-59 ఏళ్ల మధ్యవున్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలో వ్యాక్సిన్ వేయడంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పనితీరు సంతృప్తిగా ఉందన్నారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ కేంద్రంలోని వ్యాక్సినేషన్ ఏరియా, అబ్జర్వేషన్ ఏరియా రూమ్ లను పరిశీలించి, కోవిడ్ వ్యాక్సినేషన్ వేసుకునేందుకు వచ్చిన వారితో ఎంపీ, జిల్లా కలెక్టర్ లు మాట్లాడారు. కోవిడ్ వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఏ వివరాలు అవసరం అవుతాయి అనే వివరాలను వారు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ లు చవ్వా రాజశేఖర్ రెడ్డి, నరసింహులు, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి)ఏ.సిరి, వైద్య ఆరోగ్య శాఖ అడిషనల్ డైరెక్టర్ డా.సావిత్రి, మున్సిపల్ కమిషనర్ మూర్తి, ఆర్డీఓ గుణభూషన్ రెడ్డి, అడిషినల్ డిఎంహెచ్ఓ రామసుబ్బారావు, డి ఐ ఓ గంగాధర్ రెడ్డి, డీజేబుల్ వెల్ఫేర్ ఎడి రసూల్, వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement