Friday, May 17, 2024

సకలం.. సచివాలయం

పరిపాలనలో కొత్తబాట… సరికొత్త సమాంతర వ్యవస్థ
ప్రజలకు మరింత చేరువగా గ్రామ, వార్డు సచివాలయాలు
వాలంటీర్ల రంగప్రవేశంతో ప్రజల గడపకు సేవలు
తాజాగా అంగన్‌వాడీలు సచివాలయాల అజమాయిషీలోకి
తమ అధికారాలు తగ్గిపోయాయని ప్రజాప్రతినిధుల్లో అసంతృప్తి

అమరావతి, ఆంధ్రప్రభ: పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు.. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు … రేషన్‌ కార్డులు… రిజిస్ట్రేషన్‌… పెళ్లి ధ్రువీకరణ పత్రాలు… లైసెన్సులు…. పాన్‌ కార్డులు… విద్యుత్‌ మీటర్లు…. పింఛన్లు మంజూరు… చేయూత.. ఆసరా… జగనన్న తోడు… ఇలా ఏది కావాలన్నా గతంలో వివిధ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఆయా సర్టిఫికెట్లు- తెచ్చుకోవాలంటే వ్యయ ప్రయాసల కొర్వవలసి వస్తుంది. జనం ఇబ్బందులు గమనించిన ముఖ్యమంత్రి జగన్‌ పరిపాలనా వ్యవస్థలో సరికొత్త విప్లవానికి శ్రీకారం చుట్టారు. ప్రజల ముంగిటికే సేవలు అందించాలన్న లక్ష్యంతో సీఎం జగన్‌ పై సేవలన్నిటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చారు. అదే సచివాలయం.. సచివాలయం.. అదే సర్వం.. అదే సకలం.. అంతలా ప్రభుత్వం ఈ వ్యవస్థను ముందుకు తెస్తోంది. ప్రజల చేత ఎన్నుకున్న ప్రజా ప్రతినిధుల అధికారాలను మించిన అధికారాలు.. ఆయాశాఖల నుంచి వేరు చేసి మరీ అధికారాలు నేడు సచివాలయాలు, వలంటీ-ర్ల సొంతమయ్యాయి. ఫలితంగా ఇది రాజకీయంగా ఒక సమాంతర వ్యవస్థగా, ప్రస్తుత అధికార యంత్రాంగానికి ప్రత్యామ్నాయ వ్యవస్థగా వ్యవస్థీకృతమవుతోంది.

వివిధ శాఖలకు చెందిన 543 సేవలు..
రాష్ట్రంలోని 26 జిల్లాల్లో మొత్తం 15,005 గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిలో అర్బన్‌ ప్రాంతంలో 3,842 వుండగా గ్రామీణ ప్రాంతాల్లో 11,163 సచివాల యాnలున్నాయి. అత్యధికంగా పూర్వపు తూర్పు గోదావరి జిల్లాలో 1,599 వుండగా విజయనగరం జిల్లాలో తక్కువగా 778 గ్రామ వార్డు సచివాలయాలు వున్నాయి. వీటి ద్వారా ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అనేక రకాల విధులు నిర్వ హిస్తున్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు దగ్గర చేయడం ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలకు సమాంతరంగా ఒక వ్యవస్థగా స చివాలయాలు మారిపోయాయి. వీటి ద్వారా ఆధార్‌ కార్డులు మొదలు పాన్‌ కార్డులు, ఓటర్‌ కార్డులు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల నమోదు, జారీ జరుగుతోంది. కొత్తగా రేషన్‌ కార్డులు కావాలన్నా, ఉన్న రేషన్‌ కార్డును రెండుగా విభజించాలన్నా సచివాలయమే దిక్కయింది. డ్రైవింగ్‌ లైసెన్సులు, ఆర్సీల జారీ, నవదంపతుల వివాహ ధ్రువీకరణ, స్థలాలు, పొలాల రిజిస్ట్రేషన్‌, ఈసీ, అడంగల్‌ నఖళ్లు, పట్టాదార్‌ పాసు పుస్తకాల జారీ విద్యుత్‌ మీటర్ల దరఖాస్తు, జారీ వంటి 543 రకాల సేవలు అందిస్తున్నారు. ఈ సేవలన్నీ గతంలో ఆయా ప్రభుత్వ శాఖలు నేరుగా అం దించేవి. ఇప్పుడు కూడా ఆ శాఖలే ఆ సేవలను అందిస్తున్నా, వాటిని సచివాలయాల ద్వారా ప్రజలకు చేరవేస్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ప్రభుత్వం ఈ అధికారాలను ఒక్కొక్కటిగా ఆయా సచివాలయ ఉద్యోగులకు బదిలీ చేయాలని ప్రయత్నిస్తోంది. ఫలితంగా ఆయా ప్రభుత్వ శాఖల ఉనికి ప్రశ్నార్థకంగా మారిపోయే ప్రమాదం పొంచిఉందని చెబుతున్నారు.

అంగన్‌వాడీలపై సచివాలయాల అజమాయిషీ..
ప్రభుత్వం తాజాగా అంగన్‌వాడీలను సచివాలయాల అజమాయిషీ పరిధిలోకి తీసుకురావడం ఆ కోవలోకే వస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రాయోజిత స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నిర్వహించే అంగన్డీ కేంద్రాలపై ఇక నుంచి సచివా లయాల పెత్తనం పెరగనుంది. దీంతో ఇక నుంచి అంగన్వాడీ ఉద్యోగులు సొంత శాఖ పరిధిలో కాకుండా సచివాలయ ఉద్యోగుల పరిధిలో పనిచేయాల్సి ఉంటు-ందన్నమాట! గతంలో రిజిస్ట్రేషన్‌ శాఖ పరిధిలోనూ ప్రభుత్వం ఇదే ప్రయోగం చేసింది. ఓటీ-ఎస్‌ రిజస్ట్రేషన్‌, రుణ విముక్తి పత్రాలు, రిజిస్ట్రేషన్‌ పత్రాలు రిజిస్ట్రేషన్‌ శాఖతో సంబంధం లేకుండా నేరుగా సచివాలయ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేశారు. ఆ పట్టాలకు ఎలాంటి యోగ్యత లేదని బ్యాంకులు తిరస్కరించడంతో లబ్ధిదారులు అవాక్కవాల్సి వచ్చింది. అదే క్రమంలో సాంఘిక, బీసీ, గిరిజన సంక్షేమ శాఖ మొత్తం వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ పరిధిలోకి వెళ్లిపోయింది. ఇలా అన్ని సేవలు సచివాలయాల బోనులు బందీలుగా మారుతుండడం రాబోయే ప్రమాదాన్ని సూచిస్తోంది.

- Advertisement -

సచివాలయ వ్యవస్థ ప్రజా ప్రతినిధుల అధికారాలు పూర్తిగా తగ్గిపోయి సమాంతర వ్యవస్తగా స్ధిరపడింది. ముఖ్యమంత్రికి కూడా లేని చెక్‌ పవర్‌ ఉన్న సర్పంచులు నేడు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారు. సంక్షేమ పథకాల లబ్దిదారులను ఎంపికచేసే సర్పంచులు, వార్డు మెంబర్లు, గ్రామ సభ నేడు ఎందుకూ కొరగానిదిగా మారిపోయింది. ప్రజలకు పింఛను, ఆసరా, చేయూత, తోడు, అమ్మఒడి.. ఇలా ఏది కావాలన్నా గ్రామ సభ, గ్రామ పంచాయతీ లబ్ధిదారులను ఎంపిక చేయాలి. కానీ ఇప్పుడంతా వలంటీ-ర్లు, సచివాలయ సిబ్బంది ఎంపిక చేస్తున్నారు. దీంతో తాము ఎందుకు ఎన్నికయ్యారో కూడా తెలియని అయోమయ స్థితిలో ప్రజా ప్రతినిధులు ఉన్నారు. ఇది రాజ్యాంగం ప్రసాదించిన ప్రజా ప్రాతినిధ్య చట్టం, 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా అత్యంత ప్రముఖంగా తెచ్చిన పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ చట్టాలకు పూర్తిగా విరుద్ధమైనదన్న విమర్శలున్నాయి. దీంతో ఈ వ్యవస్థపై స్థానిక సంస్థల ప్రతినిధులైన సర్పంచులు, చైర్మన్లు, ఎంపీటీ-సీ, జెడ్పీటీ-సీ, ఎంపీపీ, జెడ్పీపీలు అసంతృప్తితో ఉన్నారు. స్థానిక సంస్థల్లో రాజకీయ ప్రమేయం తగ్గడం.. ఆయా ప్రభుత్వ శాఖల్లో అసంతృప్తికి దారితీస్తున్నా సచివాలయ వ్యవస్థపై ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. సచివాలయాల ద్వారా చేపడుతున్న విధుల్లో కొంత అయోమయం… వారి ధ్రువపత్రాలకు తగిన యోగ్యత లేదని తిరస్కరిస్తున్నా ప్రభుత్వం అదే పంథాలో ముందుకు పోతోంది. ఈ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు, అధికార యంత్రాంగం, బ్యూరోక్రసీని నియంత్రించడం కొందరికి మింగుడుపడడం లేదు. ప్రభుత్వం నియమించుకున్న యంత్రాంగమైన సచివాలయ సిబ్బంది, వలంటీ-ర్లతోనే మొత్తం ప్రభుత్వం నడుపుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement