Monday, May 6, 2024

స్కూళ్లలో పాగా వేసిన వైరస్.. విద్యార్థులపై కరోనా పంజా!

ఆంధ్రప్రదేశ్ లో స్కూళ్లు పునఃప్రారంభమయ్యాక విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. స్కూళ్లు తెరిచి పది రోజులు కూడా గడవక ముందే.. పదుల సంఖ్యలో విద్యార్థులు, ఉపాధ్యాయులు వైరస్ బారిన పడ్డారు. పాఠశాలలు పునఃప్రారంభమైన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 మంది విద్యార్థులు, 31 మంది ఉపాధ్యాయులు కోవిడ్ పాజిటివ్ వచ్చింది.

అక్టోబరులో థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని, చిన్నపిల్లలపై దీని ప్రభావం అధికంగా ఉంటుందని వైద్య నిపుణలు హెచ్చరిస్తున్న తరుణంలో పాఠశాలల్లో కరోనా కేసుల విజృంభణ తల్లిదండ్రులు, విద్యాశాఖ అధికారులను కలవరపెడుతోంది.  తాజాగా ప్రకాశం జిల్లాలో 14 మంది విద్యార్థులు, 5 ఉపాధ్యాయులకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఒంగోలు పట్టణంలో డీఆర్​ఆర్​ఎం ఉన్నత పాఠశాలలో నలుగురు ఉపాధ్యాయులు, ఐదుగురు విద్యార్థులకు వైరస్ నిర్ధరణ అయింది. పీవీఆర్ బాలికల పాఠశాలలో నలుగురు విద్యార్థులు, రాంనగర్ ప్రాథమిక పాఠశాలలో మరో విద్యార్థికి కరోనా సోకింది. ఉలవపాడు మండలం వీరేపల్లి పాఠశాలలో నలుగురు విద్యార్థులకు, దర్శి మండలం నిమ్మరెడ్డిపాలెంలో ఓ ఉపాధ్యాయరాలికి కరోనా పాజిటివ్​గా తేలింది.

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి తగ్గడంతో ఈనెల 16 నుంచి పాఠశాలలను పునః ప్రారంభించారు. అయితే, పాఠశాలల్లో కరోనా కేసులు క్రమంగా పెరగడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. నాలుగు రోజుల క్రితం కృష్ణా జిల్లా పెద్దపాలపర్రు పాఠశాలలో 13 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. బుధవారం విజయనగరం జిల్లాలో మరో 17 మంది విద్యార్థులకు కరోనా సోకింది. నెల్లూరు జిల్లాలో 17 మంది ఉపాధ్యాయులు, 10 మంది విద్యార్థులకు పాజిటివ్ నిర్ధారణ అయింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు జంకుతున్నారు. పాఠశాలల్లో కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతున్నా..విద్యార్థులు వైరస్ బారిన పడటం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఇది కూడా చదవండిః డేంజర్ బెల్స్…ఇండియా లో కొత్తగా 46,164 కరోనా కేసులు

Advertisement

తాజా వార్తలు

Advertisement