Sunday, May 5, 2024

AP | స‌ముద్రంలో వేట‌కు వెల్లి.. తల్లి, ఇద్దరు పిల్లల గల్లంతు

నిజాంపట్నం, (ప్రభ న్యూస్) : ఏపీలోని నిజాంపట్నం హార్బర్ వద్ద జ‌రిగిన‌ పడవ ప్రమాదంలో నాగాయలంక మండలం ఈలచెట్లదిబ్బ గ్రామానికి చెందిన తల్లి ఇద్దరు పిల్లలు గల్లంత‌య్యారు. ఈ ఘటన ఆదివారం జ‌రిగింది. నిజాంపట్నం సబ్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం కృష్ణాజిల్లా నాగాయలంక మండలం ఈలచెట్ల దిబ్బ గ్రామానికి చెందిన కొక్కిలిగడ్డ సోంబాబు, అతని భార్య సాయి వర్ధిక, వారికి ఉన్న చిన్న బోటు ద్వారా సముద్ర వేట ద్వారా వచ్చిన మత్స్య సంపదను విక్రయించి జీవనం చేస్తుంటారు. వీరికి ఇద్దరు కుమారులున్నారు.

- Advertisement -

వీరిద్దరి పిల్లలను చూసుకునే పెద్దవారు లేకపోవడంతో వారిని కూడా భార్యతో పాటు శనివారం రాత్రి వేటకు తీసుకుని వెళ్లారు. మత్స్య సంపదను అమ్ముకునే నిమిత్తం నిజాంపట్నం హార్బర్ కు వస్తున్న క్రమంలో సముద్రం నుండి హార్బర్ కు వచ్చే మొగ దగ్గర ఒక్కసారిగా పెద్ద అలలు రావటంతో బోటు అదుపుతప్పింది. అక్కడ ఉన్న రాళ్లకు గుద్దుకుని తిరగబడింది. బోటు లో ఉన్న నలుగురు సముద్రంలో పడిపోగా, సోంబాబు ఈత కొట్టుకుంటూ ప్రాణాలు దక్కించుకుని ఒడ్డుకు చేరుకున్నాడని తెలిపారు. అతని భార్య సాయి వర్ధిక (25), ఇద్దరు కుమారులు తనీష్ కుమార్ (7), తరుణేశ్వర్ (11 నెలలు) సముద్రంలోనే గల్లంతయ్యారని, వారికోసం గాలింపు చర్యలు చేపట్టినట్లుగా, ఆచూకీ తెలియ రాలేదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్సై రమేష్ బాబు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement