Friday, April 26, 2024

ఇంద్ర‌కీలాద్రిపై ఇంటి దొంగ‌లు – 13 మంది సిబ్బందిపై వేటు…

విజయవాడ- ఇంద్ర‌కీలాద్రిపై వెల‌సిన శ్రీక‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యంలో అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డిన 13 మంది సిబ్బందిపై దేవ‌దాయ ,ధ‌ర్మ‌దాయ శాక క‌మిష‌నర్ స‌స్పెన్ష‌న్ వేటు వేశారు.. స‌స్పెండ్ అయిన వారిలో అయిదుగురు సూప‌రింటెండ్స్ ఉండ‌టం విశేషం.. వివ‌రాల‌లోకి వెళితే ఇంద్రకీలాద్రిపై ఏసీబీ జరిపిన మూడ్రోజులపాటు తనిఖీల నిర్వహించి దుర్గగుడిలో అక్రమాలు జరిగినట్లు నిర్ధారించారు. జరిగిన అక్రమాలు వెలికితీసిన అవినీతి నిరోధక శాఖ అక్రమార్కుల లిస్టును ప్రభుత్వానికి సమర్పించింది. అన్నదానం, టికెట్ల అమ్మకాలు, చీరల విభాగాల్లో అక్రమాలపై నివేదిక ఇచ్చింది ఏసీబీ. ఆ రిపోర్ట్‌ ఆధారంగా 7విభాగాల్లోని ఐదుగురు సూపరింటెండెంట్లు, 8మంది సిబ్బందిని సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభుత్వానికి ఏసీబీ ఇచ్చిన నివేదిక ఆధారంగా సస్పెన్షన్‌ ఆదేశాలిచ్చారు దేవాదాయశాఖ కమిషనర్. ప్రసాదాలు..తలనీలాలు.. అమ్మవారి చీరల విక్రయాల్లోనూ అవినీతి, అక్రమాలు. ఇక శానిటేషన్‌, సెక్యూరిటీ టెండర్లలో అవకతవకలు వెలుగుచూశాయి. టెండర్లను రీకాల్‌ చేయాలన్న అధికారుల ఆదేశాలను సైతం బేఖాతరు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. దుర్గమ్మ గుడిలో కీలక డిపార్ట్‌మెంట్ల నుంచి ఏసీబీ సమాచారం సేకరించింది. అభివృద్ధి పనులు, టెండర్ల ప్రక్రియ, ఇంజనీరింగ్ విభాగాల్లోనూ ఇన్ఫర్మేషన్ తీసుకుంది. అవినీతి, అక్రమాలపై సాక్ష్యాలతో ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఈ నివేదిక‌ను మ‌రింత లోతుగా ప‌రిశీలించిన అనంత‌రం మ‌రికొంత మంది సిబ్బందిపై చ‌ర్య‌లు తీసుకునే దిశ‌గా దేవాదాయ శాఖ అడుగులు వేస్తున్న‌ది.

Advertisement

తాజా వార్తలు

Advertisement