Thursday, May 2, 2024

Counter – అబద్దాలు చెప్పడం మాని అభయ హస్తం హామీల అమలు చేయండి … బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే లు

హైదరాబాద్ -.మేడిగడ్డలో కొన్ని పిల్లర్లు కుంగిపోవడం దురదృష్టకరమని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. న్యాయ విచారణ మొదలు కాకముందే మంత్రులు తీర్పులు ఇచ్చేస్తున్నారు.. న్యాయ విచారణను మంత్రుల వ్యాఖ్యలు ప్రభావితం చేసేలా ఉన్నాయని విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు తెలంగాణ మంత్రుల బృందం వెళ్లి సందర్శించారు. ఈ సందర్భంగా.. బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ ప్రెస్ మీట్ నిర్వహించారు. కడియం మాట్లాడుతూ, మరోవైపు.. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాను కేసీఆర్ అడగలేదని ఉత్తమ్ అనడం సిగ్గు చేటని దుయ్యబట్టారు. తాను డిప్యూటీ సీఎంగా ఉండగా.. కేసీఆర్ తో పాటు పీఎంను కలిసి కాళేశ్వరంకు జాతీయ హోదా అడిగామన్నారు. ఎన్నో సార్లు కేసీఆర్ పీఎం మోడీకి జాతీయ హోదా కోసం లేఖలు రాశారన్నారు. పాలమూరు రంగారెడ్డికి కూడా జాతీయ హోదా అడిగామని చెప్పారు. కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టుల అంచనాల వ్యయం పెరగడం గురించి విచిత్రంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.

దేశంలో అంచనాలు పెరగకుండా ప్రాజెక్టుల నిర్మాణాలు జరిగాయా అని ప్రశ్నించారు. పదే పదే ఆయకట్టు పెరగలేదు అంటున్నారు.. అదే నిజమైతే తెలంగాణలో ఇన్ని కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి ఎలా సాధ్యపడుతుంది? అని కడియం ప్రశ్నించారు. వరి ధాన్యం సేకరణకు చెల్లించిన డబ్బులు చూస్తే ఆయకట్టు పెరిగిందా లేదా తెలుస్తుందని కడియం శ్రీహరి తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా అబద్దాలు చెప్పడం మాని అభయ హస్తం హామీల అమలు గురించి ఆలోచించండని వ్యాఖ్యలు చేశారు కడియం శ్రీహరి. రేవంత్ రెడ్డి ఎన్నికల సందర్భంగా హామీల అమలుకు తేదీలు కూడా చెప్పారు.. ఆ తేదీలు గడిచిపోయినా ఇచ్చిన హామీల గురించి మాట్లాడటం లేదని ఆరోపించారు. నిరుద్యోగ భృతి గురించి ఎన్నికల్లో చెప్పి.. ఎప్పుడు చెప్పామని భట్టి అసెంబ్లీలో అన్నారని తెలిపారు.అవసరమైతే ఆరు నెలలు అయినా తీసుకోండి.. కానీ 412 హామీలు అమలు చేయండని పేర్కొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement