Saturday, May 18, 2024

ఆగ‌స్ట్ 15న ఎపిలో విలేజ్ క్లినిక్స్ ప్రారంభం – జ‌గ‌న్

అమ‌రావ‌తి – యుద్ధ ప్రాతిపాదికన విలేజ్‌ క్లినిక్స్‌ నిర్మాణం జరగాలని ఎపి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అధికారులను ఆదేశించారు. ఆగ‌స్టు 15న విలేజ్‌ క్లీనిక్స్‌ ప్రారంభించ‌నున్నామ‌ని వారికి తెలిపారు.. గ్రామ స్థాయిలో ఆరోగ్యశ్రీ రెఫరెల్‌ పాయింట్‌గా విలేజ్‌ క్లీనిక్స్‌ ఉంటాయని చెప్పారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వైయస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ మాట్లాడుతూ, గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్‌ల భవన నిర్మాణాలు వేగంగా జరగాలని ఆదేశించారు. మే నాటికల్లా గ్రామ సచివాలయాల భవన నిర్మాణాలు పూర్తి కావాలన్నారు. రైతు భరోసా కేంద్రాల నిర్మాణంలో నెల్లూరు, అనంతపురం, కృష్ణా జిల్లాలు మెరుగుపడాలన్నారు. జూలై 8న వైయస్‌ఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా రైతు భ‌రోసా కేంద్రాల‌ను ప్రారంభించాలని సూచించారు. అలాగే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో దేశంలోనే మూడో స్థానంలో మన రాష్ట్రం ఉందని పేర్కొన్నారు. రూ.5818 కోట్లు నేరుగా కూలీలకు ఇవ్వగలిగామని చెప్పారు.
అలాగే ఏప్రిల్‌ 13న గ్రామ, వార్డు వాలంటీర్లను సత్కరించాలని కలెక్టర్లకు సూచించారు. ఏప్రిల్, మే నెలలో ప్రారంభించే పథకాలు, కార్యక్రమాల‌ను వివ‌రించారు జ‌గ‌న్. ఏప్రిల్‌ 16న జగనన్న విద్యా దీవెన పథకం ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. విద్యా దీవెన కింద నేరుగా తల్లుల అకౌంట్లలోకే నగదు జమ చేస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్‌ 20న వైయస్‌ఆర్‌ సున్నా వడ్డీ పథకం ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. రబీకి సంబంధించి రైతుల అకౌంట్లలోకి నేరుగా నగదు జమ చేస్తున్నట్లు చెప్పారు. ఏప్రిల్‌ 23న వైయస్‌ఆర్‌ సున్నా వడ్డీ కింద డ్వాక్రా మహిళల అకౌంట్లలోకి నగదు జమ చేస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్‌ 28న జగనన్న వసతి దీవెన ప్రారంభిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. ఏడాదిలో మూడుసార్లు జగనన్న వసతి దీవెన అందజేస్తున్నట్లు చెప్పారు. మే 13న వైయస్‌ఆర్‌ రైతు భరోసా, 18న మత్స్యకార భరోసా, 25న ఖరీఫ్‌ బీమా అందజేస్తున్నట్లు సీఎం కలెక్టర్లకు తెలిపారు. ఈ కార్యక్రమాలు విజయంతం చేయాలని, అర్హులకు ఏ ఒక్కరికీ కూడా అన్యాయం జరుగకూడదని సీఎం సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement