Monday, April 29, 2024

TS: దేశంలోనే కామారెడ్డిని ఆదర్శం చేస్తాం… రోడ్డు షోలో మంత్రి కేటీఆర్…

కామారెడ్డి ప్రతినిధి, నవంబర్ 28 (ప్రభ న్యూస్) : కామారెడ్డి నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఇవాళ‌ జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కేసీఆర్ పోటీ చేస్తున్నారని గుర్తు చేశారు. ఆయనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఇందిరమ్మ రాజ్యం వస్తే గ్రామాలు అంధకారంగా మారుతాయని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ మాటలు నమ్మి మోసపోవద్దని ఆయన సూచించారు. అన్నివర్గాల సంక్షేమానికి ఎన్నో పథకాలను అమలు చేయడం జరుగుతుందని తెలిపారు.

కామారెడ్డిలో మాస్టర్ ప్లాన్ రద్దు చేసినప్పటికీ కొందరు నాయకులు దానిని రాజకీయంగా వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కామారెడ్డి ఎమ్మెల్యేగా ఉండడం ఇక్కడి ప్రాంత ప్రజలు ఎంతో అదృష్టవంతులన్నారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. అంతేకాకుండా 5లక్షల బీమా సౌకర్యం కల్పించడం జరుగుతుందని చెప్పారు. సౌభాగ్య లక్ష్మి పథకం కింద మహిళలకు మూడువేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందన్నారు. పట్టణంలో నిర్వహించిన రోడ్డు షోకు భారీ స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, జిల్లా పార్టీ అధ్యక్షులు ముజీబ్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement