మరోసారి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. కొత్త వేరియంట్ పట్ల ప్రభుత్వం అప్రమత్తతతో ఉండాలని, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కొత్త వేరియంట్ కేసులు దేశంలో నమోదు కాలేదన్నారు. సౌత్ ఆఫ్రికా, బొట్స్వానా, హాంగ్కాంగ్తో పాటు పలు యూరోపియన్ దేశాల్లో ఒమిక్రాన్ గుర్తించారన్నారు.
ఆయా దేశాల కొత్త వేరియంట్ రాకుండా అడ్డుకునేలా విమానాశ్రయాల్లోనే పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే జీనోమ్సీక్వెన్సింగ్ చేసే ప్రక్రియను బలోపేతం చేసినట్లు చెప్పారు. ఆయా దేశాల నుంచి వచ్చిన వారికి ప్రత్యేకంగా ఇండ్లకు తరలించి, పాజిటివ్గా తేలిన వారికి 14 రోజుల హోం క్వారంటైన్కు తరలించడంతో పాటు మానిటరింగ్ చేయనున్నట్లు వివరించారు. కొవిడ్ వైరస్లో వివిధ వేరియంట్లతో పాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నుంచి వ్యాక్సినేషన్ ఒక్కటే కాపాడగలదన్నారు. రాష్ట్రంలో కేసులు కరోనా పెరగడం లేదని, నిలకడగానే ఉన్నాయన్నారు.
మూడో వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు అన్ని సిద్ధం చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో 90శాతం మందికి మొదటి డోసు పూర్తి అయ్యిందని, రాష్ట్రంలో 45శాతం మందికి రెండో డోసు ఇచ్చినట్లు తెలిపారు. కరోనా కేసులు తగ్గడంతో కొందరు టీకాను నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఆయన.. దాదాపు 20 లక్షల మంది రెండో డోసుకు సమయం దాటినప్పటికీ తీసుకోవడం లేదన్నారు. ఏ వేరియంట్ అయినా ఎదుర్కోవడం మన చేతుల్లోనే ఉందని, వైరస్ ఉత్పరివర్తనాలు చాలా జరుగుతాయన్నాయని డీఎంఈ రమేశ్రెడ్డి అన్నారు. ఒమిక్రాన్ ప్రమాదకర స్థాయిపై పరిశోధనలు జరుగుతున్నాయని, రోజు కేసులు తక్కువ నమోదవుతున్నందున అలసత్వం పనికిరాదని సూచించారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..