Monday, April 29, 2024

డైరెక్షన్ ఢిల్లీది.. యాక్షన్ రాష్ట్ర బీజేపీది : ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి

నర్సంపేట : 10వ తరగతి పేపర్ లీకేజీకి కర్త, కర్మ, క్రియ అంతా బండి సంజయ్ నే.. బీజేపీ పార్టీకి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా బండి సంజయ్ ను వెంటనే బీజేపీ నుండి సస్పెండ్ చేయాల‌ని ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి అన్నారు. గురువారం నర్సంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. తన సొంత పార్లమెంట్ పరిధిలోనే ఇలాంటి చర్యకు పాల్పడటం సిగ్గుచేటు అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతూ.. వారి తల్లిదండ్రుల్లో ఆందోళనలు రేకెత్తించడం ఒక దృచర్య అని, చట్ట సభల్లో భారత రాజ్యాంగం బద్దంగా ప్రమాణ స్వీకారం చేసి, దానికి విరుద్దంగా ప్రవర్తించడం సిగ్గుచేటు అన్నారు. సమాజానికి నష్టం వాటిల్లే సమాచారం ఏదైనా వచ్చినప్పుడు దాన్ని కచ్చితంగా సంబంధిత అధికారులకు చేరవేయాల‌న్నారు. ఓట్లతో ప్రజల మనస్సులను చూరగొనలేక వక్రబుద్దిని ప్రదర్శించి దొడ్డి దారిన అధికారంలోకి రావాలనుకోవడం మూర్ఖత్వం అన్నారు. డైరెక్షన్ ఢిల్లీది.. యాక్షన్ రాష్ట్ర బీజేపీది అన్నారు. పోలీస్ దర్యాప్తుకు సహకరించకుండా బండి సంజయ్ సెల్ ఫోన్స్ దాచిపెట్టడంలో ఆంతర్యమేమిటి..? అన్నారు. కేంద్ర క్యాబినెట్ మొత్తం తెలంగాణలో పాగా వేస్తుంద‌ని, మీరు మాకిచ్చిన నిధులెన్ని? తెచ్చిన పనులెన్ని..? ఎందుకంత ఆరాటం? అన్నారు. బండి సంజయ్ కి అత్యంత సన్నిహితుడే పేపర్ లీకేజీకి పాల్పడం ఆ ఫొటోను వారికే పంపడంలో అర్థం ఏమిటి..? అన్నారు. ఎప్పటికి మీడియాలో పోజులు కొట్టే రేవంత్ రెడ్డి ఇంత జరుగుతున్నా కనీసం పత్తా లేడు.. రాష్టానికి రాబోతున్న మోడీ తాను చదువుకున్న సర్టిఫికెట్స్ చూపించి తెలంగాణలో అడుగుపెట్టాల‌న్నారు. ఎందుకంత భయం నిజమేంటో తేల్చోచ్చుకదా…? అని ప్ర‌శ్నించారు. కేవలం మీడియాలో హల్ చల్ కోసమే సమర్థత లేని మాటలు మాట్లాడుతున్నారు తప్పా అందులో వాస్తవం లేదు. NREGSను వ్యవసాయానికి అనుసంధానం చేయాలని అసెంబ్లీ సాక్షిగా ఎంత మొత్తుకున్నా కేంద్రంలో పట్టించుకున్న నాధుడే లేడు. మా న్యాయమైన డిమాండ్లను ఎందుకు పరిష్కరించరు. రైతుల పొలాల్లో ఉన్న మోటార్లకు మీటర్లను పెట్టడంపై మోడీకి కనీస స్పందన లేదన్నారు. ఎల్లుండి ప్రధాన మంత్రి మోడీ తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు.. ఉపాధి హామీని పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడంపై మోడీకి పోస్టు కార్డుల ద్వారా నిరసన తెలిపే “ఉత్తర యుద్ధం” కార్యక్రమం త్వరలో ప్రారంభంకానుంద‌న్నారు. మీ దుర్మార్గపు పాలనకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలను సంసిద్ధం చేస్తామ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement