Tuesday, April 30, 2024

Khammam: వాడవాడలా పువ్వాడ కార్యక్రమం.. ప్రజలతో మంత్రి మమేకం…

ఖమ్మం : ఖమ్మం నగర ప్రజల అవసరాలకనుగుణంగా, అభివృద్ధి పనులను పూర్తి చేసి నగరాన్ని అన్ని రంగాల్లో ముందంజలో ఉంచడం జరిగిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం మంత్రి డివిజన్లలో పర్యటించి చేపట్టిన పనులు, ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని స్వయంగా నగరవాసులతో మాట్లాడుతూ వివరాలను తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కారం చూపారు. వాడవాడ పువ్వాడ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం నగరంలోని 29, 30వ డివిజన్లలో మంత్రి అధికారులతో కలిసి పర్యటించారు. తొలుత ప్రొఫెసర్‌ జయశంకర్‌ పార్క్‌ లోకి వెళ్ళి అక్కడ సౌకర్యాలను పరిశీలించారు. పార్క్‌ లో ఉన్న చేస్‌ బోర్డ్‌, ఓపెన్‌ జిమ్‌, వాకింగ్‌ ట్రాక్‌ ను పరిశీలించి వాకర్స్‌ తో మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి డివిజన్‌ లోని ఇంటింటికి నేరుగా వెళ్లి ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మిషన్‌ భగీరథ ద్వారా వస్తున్న త్రాగునీటిని పరిశీలించారు.

నీరు పుష్కలంగా వస్తున్నాయని ఆయా గృహంలోని మహిళలు చెప్పడంతో మంత్రి పువ్వాడ సంతృప్తి వ్యక్తం చేశారు. డివిజన్‌ లో విద్యుత్‌, త్రాగునీరు, పారిశుధ్యం, వృద్ధుల పెన్షన్లు, డ్రెయిన్లు తదితర సమస్యలపై ఆరా తీశారు. అసంపూర్తిగా ఉన్న సైడ్‌ కాల్వల మరమ్మతులు చేపట్టాలని, అవసరమయ్యే చోట సీసీ రోడ్స్‌, సైడు కాల్వలకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని మున్సిపల్‌ అధికారులను మంత్రి అదేశించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందుతున్నాయా లేదా అని అవ్వలను ఆరా తీశారు. ప్రతి నెలా ఆసరా పెన్షన్‌ అందుతున్నాయని అవ్వలు నవ్వుతూ బదులిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా స్వయంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలు తెలుసుకునే అవకాశం కలిగిందన్నారు. ఈ సందర్భంగా సుడా నిధుల రూ.20లక్షలతో 30వ డివిజన్‌ లో నిర్మించిన సీసీ రోడ్డును మంత్రి ప్రారంభించారు.

ఖమ్మం నగరంలో నేడు అద్భుతంగా ప్రజలకు అవసరమయ్యే అన్ని వసతులు కల్పించామని, ప్రతి గల్లిలో విడిఎఫ్‌ టెక్నాలజీతో సీసీ రోడ్స్‌, సి.సి డ్రెయిన్లు వేశామన్నారు. ఇప్పటికే పర్యటించిన డివిజన్లలో అసంపూర్తిగా ఉన్న రోడ్లు, ఇరుకు రోడ్లను గుర్తించామని, ప్రజల అభ్యర్థన మేరకు సుడా ఫండ్స్‌ ద్వారా రూ.12 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఆయా నిధులతో డివిజన్లలో విడిఎఫ్‌ టెక్నాలజీ తో సీసీ రోడ్స్‌ నిర్మిస్తామన్నారు. ఇప్పటికే ఎస్‌డిఎఫ్‌ నిధులు రూ.50 కోట్లతో ప్రతి అన్ని డివిజన్లలో దాదాపు మూడు కిలోమీటర్ల మేర సైడ్‌ డ్రెయిన్లు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి మిషన్‌ భగీరథ పథకం ద్వారా శుద్ధమైన త్రాగునీరు ప్రతిరోజూ వస్తున్నాయని ఒక మహిళ చెప్పడం చాలా సంతోషం కలిగించిందన్నారు. ప్రజల విజ్ఞప్తి మేరకు ప్రకాష్‌ నగర్‌ గోళ్ళపాడు ఛానల్‌ పై మరో పార్క్‌ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.

- Advertisement -

వర్షాకాలం వచ్చిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, దోమల వ్యాప్తి, రోగాలు ప్రబలకుండా ఉండేందుకు ఇంట్లో పాత కూలర్లు, ప్లాస్టిక్‌ వస్తువు, కుండీలు, తదితర పని చేయని వస్తువుల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధ్వర్యంలో కాల్వలు, నీటి నిల్వ ఉండే ప్రాంతాల్లో ఆయిల్‌ బాల్స్‌ పంపిణీ చేశామని, ప్రజలు కూడా ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట నగర్‌ మేయర్‌ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌ కుమార్‌, మునిసిపల్‌ కమీషనర్‌ ఆదర్శ్‌ సూరబీ, కార్పొరేటర్లు యర్ర గోపి, ధనాల శ్రీకాంత్‌, దోన్వాన్‌ సరస్వతి రవి నాయక్‌, ముక్కాల కమల, గజ్జెల లక్ష్మీ వెంకన్న, అసిస్టెంట్‌ కమీషనర్‌ మల్లీశ్వరి, మునిసిపల్‌ ఇఇ క్రిష్ణ లాల్‌, పబ్లిక్‌ హెల్త్‌ ఇఇ రంజిత్‌, డిఈ లు నవ్య జ్యోతి, స్వరూప రాణి, ఖమ్మం అర్బన్‌ తహశిల్దార్‌ శైలజ, నాయకులు పత్తిపాక రమేష్‌, మెంతుల శ్రీశైలం, యర్ర అప్పారావు, పాలడుగు పాపారావు, ఈశ్వర, మల్లేశం, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement