Wednesday, April 24, 2024

Spl Story | దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ..​ కేంద్రం విధానాలపై సీఎంలు సీరియస్​!

దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని, రాష్ట్రాల అధికారాలను కేంద్రం తన చెప్పుచేతల్లోకి తీసుకుంటోందని ఎనిమిది రాష్ట్రాల సీఎంలు మండిపడ్డారు. ఈ క్రమంలో ఇవ్వాల (శనివారం) జరిగిన నీతి ఆయోగ్​ భేటీకి మూకుమ్ముడిగా డుమ్మా కొట్టారు. అంతేకాకుండా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికే కీలక అధికారులు ఉంటాయన్న సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తుంగలో తొక్కి… ఢిల్లీపై అధికారం చెలాయించాలని చూస్తున్న మోదీ ప్రభుత్వంపై నిరసన వెలిబుచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్​ తీసుకురావడాన్ని తప్పుపట్టారు. ఈ క్రమంలోనే నూతన పార్లమెంట్​ భవన ప్రారంభోత్సవానికి కూడా హాజరుకాలేమని 21 ప్రతిపక్ష పార్టీలు ఖరాకండిగా తేల్చి చెప్పేశాయి.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

నీతి ఆయోగ్ ఎనిమిదవ పాలక మండలి భేటీకి బీజేపీయేతర పాలిత రాష్ట్రాలకు చెందిన ఎనిమిది మంది సీఎంలు హాజరవ్వలేదు. ఇవ్వాల (శనివారం) జరిగిన ఈ సమావేశాన్ని వారు బహిష్కరించడంతో భారత రాజకీయాల్లో విభేదాలు తీవ్రమయ్యాయి. అంతేకాకుండా రేపు (మే 28న) జరగనున్న కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని కూడా బహిష్కరించాలని 21 ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించాయి. అందులో నీతి ఆయోగ్​ భేటీకి రాకపోవడం కూడా ఒకటి. కాగా, నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.

ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్​ గవర్నింగ్​ కౌన్సిల్​ భేటీకి పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు డుమ్మా కొట్టారు. వీరిలో తెలంగాణ సీఎం కేసీఆర్​, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, కేరళ సీఎం పినరయి విజయన్, బిహార్ సీఎం  నితీష్ కుమార్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఉన్నారు. 

- Advertisement -

ప్రతిపక్షం ఎందుకు బహిష్కరిస్తోంది?

ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికే కీలక అధికారాలు ఉండాలన్న సుప్రీంకోర్టు తీర్పును కాదని, కేంద్ర ప్రభుత్వం ఢిల్లీపై పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నిస్తోంది. దీనికోసం బ్యూరోక్రాట్‌ల బదిలీ, పోస్టింగ్‌లపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా మద్దతు సేకరించడానికి ప్రతిపక్ష నేతలను ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కలుస్తున్నారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా ఈ సమావేశాన్ని పలు రాష్ట్రాల సీఎంలు బహిష్కరించారు. అయితే.. బెంగాల్​ సీఎం మమతా బెనర్జీ ఆ రాష్ట్రం నుంచి ఒక ప్రతినిధిని పంపడానికి ప్రతిపాదించారు. కాగా, ఆమె అభ్యర్థనను కేంద్రం తిరస్కరించింది, అంతేకాకుండా స్వయంగా మమతా బెనర్జీనే సమావేశానికి హాజరు కావాలని కేంద్రం చెప్పింది. ఇక.. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ భారతదేశంలో లేరు. అతను ప్రస్తుతం సింగపూర్, జపాన్ పర్యటనలో ఉన్నారు. దీంతో స్టాలిన్​ ఈ సమావేశానికి హాజరు కాలేదు. కేరళ సీఎం పినరయి విజయన్ హాజరుకాకపోవడానికి గల కారణాలు అయితే ఇంకా తెలియరాలేదు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా ముందస్తు కట్టుబాట్లను పేర్కొంటూ సమావేశానికి మినహాయింపు ఇచ్చారు.

అదేవిధంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్​ ముందస్తుగా సమావేశమయ్యారు. ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్రం ఆర్డినెన్స్ ను తీసుకురావడాన్ని వ్యతిరేకించడంలో నితీశ్​కుమార్​​, కేసీఆర్​ ఇద్దరూ కేజ్రీవాల్‌కు మద్దతు ఇస్తున్నారు. కాగా, అనారోగ్య కారణాలతో రాజస్థాన్ సీఎం సమావేశానికి దూరంగా ఉన్నట్టు పేర్కొన్నారు. మరోవైపు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ నిధుల కేటాయింపు విషయంలో పంజాబ్ పట్ల కేంద్రం చూపుతున్న వివక్షతకు తన గైర్హాజరీకి కారణమని తెలిపారు. అయితే.. ఈ నీతి ఆయోగ్​ భేటీలో వంద ముఖ్యమైన అంశాలపై చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశాన్ని దాటవేసే పార్టీలు “రాష్ట్రాభివృద్ధిని బహిష్కరిస్తున్నట్లు కనిపిస్తున్నాయి” అని కేంద్ర ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ ఓ వార్త సంస్థ కథనం ప్రచురించింది.

2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మార్చడం, MSMEలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, సమ్మతిని తగ్గించడం, మహిళా సాధికారత, ఆరోగ్యం, పోషకాహారం, నైపుణ్యాభివృద్ధి.. ప్రగతి వంటి అంశాలపై ఈ సమావేశంలో రోడ్‌మ్యాప్ వంటి నిర్ధేశనం ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. ముఖ్యమైన అభివృద్ధి సమస్యలను గుర్తించడంలో.. ఉమ్మడిగా పరిష్కారాలను కనుగొనడంలో ఈ సమావేశాలు కేంద్రం, రాష్ట్రాలు రెండింటికీ అవకాశం కల్పిస్తాయని అధికార వర్గాలు నొక్కిచెప్పాయి. కాగా, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా ప్రతిపక్షాలను తీవ్రంగా విమర్శించారు. దేశ అభివృద్ధికి నీతి ఆయోగ్ చాలా కీలకం. వంద అంశాలు చర్చకు రావాలని ప్రతిపాదించినప్పటికీ, ఎనిమిది మంది ముఖ్యమంత్రులు సమావేశానికి రాలేదు. తద్వారా తమ రాష్ట్ర ప్రజల వాయిస్​ని వినిపించడంలో వారు  విఫలమయ్యారు. వారికి అభివృద్ధి చేయాలన్న దృక్కోణం లేదా? మోదీకి వ్యతిరేకంగా మీరు ఏ మేరకు నిరసన తెలియజేలనుకుంటున్నారు? అని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement