Friday, May 3, 2024

TS రాష్ట్రంలోని ప్రతి బిడ్డకు ఉద్యోగం కల్పించడమే త‌మ ల‌క్ష్యం – ఉప ముఖ్యమంత్రి భ‌ట్టి..

కొత్త‌గూడెం – మార్చి నెలలో 200 యూనిట్లు లోపు విద్యుత్ బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. త్వరలో కొత్త విద్యుత్ పాలసీలను తీసుకొస్తామని చెప్పారు. కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభలో భట్టి వి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదేళ్లుగా విద్యుత్ పాలసీ లేకపోవడంతో రాష్ట్రానికి ఎవరు రాలేదని తెలిపారు.
రాష్ట్రంలోని బొగ్గు గనులన్నీ సింగరేణికే చెందాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సర్కులర్ జారీ చేసింది.. గత పదేళ్లుగా కనీస వేతన చట్టం లేక లక్షలాది కార్మికులు నష్టపోయారని డిప్యూటీ సీఎం తెలిపారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, ఎస్ఆర్ఎస్పి భారీ ప్రాజెక్టులపై పంప్ స్టోరేజ్ కి ప్రణాళికలు చేస్తున్నామన్నారు.
27న చేవెళ్ల సభలో మరో రెండు గ్యారెంటీ పథకాల అమలు ప్రకటన చేస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. డ్వాక్రా సంఘాలకు త్వరలో వడ్డీ లేని రుణాలు అందిస్తామని చెప్పారు. 43 వేల మంది సింగరేణి కార్మికులకు కోటి రూపాయల భీమా పథకాన్ని రేపు ప్రారంభిస్తున్నామని తెలిపారు. గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం మాటలకే పరిమితం కావడంతో సింగరేణిలో ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయిందని తెలిపారు. రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డకు ఉద్యోగం కల్పించడమే ఇందిరమ్మ సంక్షేమ రాజ్యం లక్ష్యమని అన్నారు. గత ప్రభుత్వం ప్రారంభించిన భద్రాద్రి, యాదాద్రి ధర్మల్ విద్యుత్ కేంద్రాలు రాష్ట్రానికి గుదిబండలా మారాయని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement