Friday, May 3, 2024

TS – తెలంగాణ అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై మండలిలో హాట్ హాట్ చర్చ

హైదరాబాద్ : శాసనమండలిలో తెలంగాణ అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై గురువారం చర్చ జరిగింది. కాకతీయ తోరణంలో ఏం రాచరికపు ఆనవాళ్ళు ఉన్నాయని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ప్రశ్నించారు..భూమి, నీటిని తల్లితో పోలుస్తాం, అదే విధంగా తెలంగాణ ఉద్యమంలో ఓ ప్రొఫెసర్ తెలంగాణ తల్లి ప్రతిమను రూపొందించారన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే ఓ సామాజికవర్గ దొరసాని గుర్తుకు వస్తుందని ప్రభుత్వ పెద్దలు చెప్పడం సమంజసం కాదని దేశపతి శ్రీనివాస్ తెలిపారు.

మంత్రి శ్రీధర్ సమాధానమిస్తూ… కాకతీయ తోరణం, తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని మార్పులు చేర్పులు ఉంటాయన్నారు. రాష్ట్ర ప్రజల సెంటిమెంట్‌ను గౌరవిస్తామన్నారు. కాకతీయులు, మొగల్ సామ్రాజ్యంలో మంచి, చెడు రెండు జరిగాయని… చెడు మరోసారి జరుగకుండా చూస్తామన్నారు.

ప్రభుత్వమే విగ్రహం తయారుచేయదని… అన్ని వర్గాల అభిప్రాయాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సింగిల్‌గా నిర్ణయం తీసుకోమన్నారు. విగ్రహం, చిహ్నం తయారీలో బీఆర్ఎస్ నేతల సలహాలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. కాకతీయ రాజులు తెలంగాణ సమాజానికి ఎంతో మంచి పనులు చేశారు. నిజాం రాజులు హైదరాబాద్ అభివృద్ధిలో చెరగని ముద్ర వేశారని దేశపతి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement