Tuesday, April 30, 2024

TS – గోండు గిరిజనుల గోస పట్టదా? – విజయ్ సంకల్ప యాత్రలో ఈటల

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో (ప్రభ న్యూస్) అధికారంలోకి రాగానే అడవి బిడ్డలు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలందిస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు ఊసె త్తకపోవడం శోచనీయమని మాజీ మంత్రి బిజెపి జాతీయ కార్యదర్శి సభ్యుడు ఈటెల రాజేందర్ అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో విజయ సంకల్ప బస్సు యాత్ర గురువారం ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్, ఇంద్రవెల్లి, ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతాల్లో కొనసాగింది. ఈ బస్సు యాత్రలో బిజెపి నేత ఈటెల రాజేందర్, ఎంపీ సోయం బాపూరావు, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.

తొలుత గుడిహాత్నూర్ లో బస్సు యాత్రకు ఘన స్వాగతం పలికారు. ఇంద్రవెల్లి లో జరిగిన రోడ్ షోలో ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. పట్టాల విషయంలో అడవి బిడ్డల గోసపుచ్చుకోవద్దని హితవు పలికారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం కొండ నాలుకకు మందు పెడతామని చెప్పి ఉన్న నాలుక ఊడబీకారని, పోడుపట్టాలిస్తామని నమ్మించి 13 కాలంలు తొలగించి ఆదివాసుల హక్కులు కాలరాశారని ధ్వజమెత్తారు. పోడు పట్టాల పేరిట గత పాలకులు కమిటీల మీద కమిటీలు వేసి కాలయాపన చేశారని, కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మోడీ నాయకత్వంలో భారతదేశం నెంబర్ వన్

ఉట్నూర్ (ప్రభన్యూస్) నరేంద్ర మోడీ నాయకత్వ కాలంలో భారతదేశం నెంబర్ 1 గా నిలుస్తుందని బిజెపి ఎన్నికల నిర్వహణ కమిటీ అధ్యక్షులు మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. గురువారం మధ్యాహ్నం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పట్టణ కేంద్రంలోని ఐబి చౌరస్తాలో నిర్వహించిన బిజెపి విజయసంకల్ప యాత్రలో ఆయన పాల్గొని మాట్లాడుతూ నరేంద్ర మోడీని మూడోసారి ప్రధానమంత్రిగా చేయడానికి ప్రజలు నాయకులు ఆశీర్వదించాలని అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ రెండుసార్లు చేసిన పాలనలో ఇతర దేశాలకు ఆదర్శంగా పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బిజెపి పార్టీకి ఆశీర్వదించి బిజెపి అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.

- Advertisement -

తెలంగాణలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని ఇచ్చిన హామీలను విస్మరించారని ఆ హామీలను ప్రజలు కూడా మర్చిపోతున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అంటే ఆయన కంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన ఇచ్చిన హామీల నిలబెట్టుకోవడంలో విస్మరిస్తున్నారని ఆయన విమర్శించారు. కేంద్రంలో రాష్ట్రంలో సుపరిపాలన కావాలంటే నరేంద్ర మోడీ నాయకత్వానికి మద్దతు తెలపాలని ఆయన పిలుపునిచ్చారు. ఏజెన్సీ మండలాల్లో గిరిజనేతరులు సాగు చేస్తున్న భూములకు పట్టాలు రైతుబంధు రావాలంటే బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని ఆయన అన్నారు.

ఏజెన్సీ మండలాల్లో గిరిజ నేతలు సాగు చేసుకుంటున్న భూములకు పరిహారం చెల్లింపుట్లో ఈ ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని ఆయన విమర్శించారు. కేంద్రంలో మూడోసారి బిజెపి అధికారంలోకి వస్తే నరేంద్ర మోడీ నాయకత్వంలో అన్ని వర్గాల అభివృద్ధి తో పాటు ఆయన పాలన సబ్కా కా సత్ సబ్కా కా వికాస్ నరేంద్ర మోడీ లక్ష్యమని ఆయన అన్నారు.

ఈ సంకల్ప యాత్రలో ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు సోయం బాపూరావు ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, మాజీ పార్లమెంటు సభ్యులు రాథోడ్ రమేష్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయిల శంకర్, రాష్ట్ర జిల్లా నాయకులు ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement