Sunday, April 28, 2024

KHM: భక్తులతో కళకళలాడుతున్న మినీ మేడారం.. వన దేవతలను దర్శించుకున్న ఎమ్మెల్యే పాయం

మణుగూరు, పిభ్రవరి 22 (ప్రభ న్యూస్): ఆదివాసుల ఆరాధ్యదైవం, నమ్మిన భక్తులకు వరాలు ఇచ్చే వన దేవతలైన సమ్మక్క-సారక్క జాతర మినీ మేడారంగా ప్రసిద్ది గాంచిన తోగ్గూడెం జాతర భక్తులతో కళకళలాడుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని, మణుగూరు మండలంలోని తోగ్గూడెం గ్రామంలో వెలిసిన సమ్మక్క, సారక్క జాతరకు భక్తులు పోటెత్తారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద మహా కుంభమేళాగా, ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని‌ మేడారంలో జరుగుతున్న జాతరకు లక్షల మంది వాహనాలు ద్వారా జాతరకు తరలి వెళ్తున్నారు. మేడారం వెళ్ళలేని భక్తులు తోగ్గూడెం గ్రామంలో వెలిసిన సమ్మక్క, సారక్క దేవతలను వందలాది మంది భక్తులు ఇక్కడ దర్శించుకొని మొక్కులను తీర్చుకుంటారు. ఎంతోమంది భక్తులు ఈ జాతరకు తరలివచ్చి చల్లంగా చూడాలి తల్లీ అంటూ భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. బుధవారం రోజు సారక్క, పగిడెద్దరాజులు గద్దెల పై కొలువుదీరగా, గురువారం సాయంత్రం సమ్మక్క తల్లి గద్దెకు చేరుకోనుంది. గిరిజన సాంప్రదాయాల మధ్య ఈ మహ జాతర ఆరంభమైంది.

ఈ జాతర శుక్రవారం వరకు కోనసాగగా, శనివారం వన దేవతలైన సమ్మక్క, సారక్కలు వన ప్రవేశం చేయనున్నారు. ఆలయ కమిటి, సింగరేణి యాజమాన్యం భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. భక్తుల సౌకర్యార్ధం కొంతమంది దాతలు ఉచితంగా అన్నదానం, మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్న చేపట్టారు. శివశక్తులు, దేవరలతో పాటు, భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతుంది. ఇప్పటికే మణుగూరు, అశ్వాపురం, పినపాక మండలాల నుండి అమ్మవారలను దర్శించుకుంటున్నారు. ఈరోజు సాయంత్రం సమ్మక్క తల్లిని గద్దె పైకి తోడ్కువచ్చెందుకు, ఆలయ కమిటి, పూజారులు సర్వం సిద్దం చేశారు. సమ్మక తల్లి రధం గుట్ట, అటవి ప్రాంతం నుండి జనారణ్యంలోకి వచ్చి భక్తులకు దర్శనం ఇవ్వనుంది. ఆ సమ్మక్క తల్లి రాక కోసం వందలాది మంది భక్తులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. సమ్మక్క తల్లి వచ్చేటప్పుడు రహదారిపై ట్రాఫిక్ అంతారయం కలుగకుండా పలు వాహనాలను దారి మళ్ళించేందుకు మణుగూరు పోలీసు చర్యలు చేపట్టారు.

వన దేవతలను దర్శించుకున్న ఎమ్మెల్యే పాయం
తోగ్గూడెం గ్రామంలో కొలువైన అమ్మవారులైన సమ్మక్క, సారక్కలను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు దర్శించుకున్నారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును, గిరిజన సంప్రదాయల మధ్య మర్యాద పూర్వకంగా ఆలయ కమిటి, పూజరులు ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుతో పాటు, మణుగూరు తహ‌శీల్దార్ రాఘవ రెడ్డి, అమ్మవారలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటి వారు ఎమ్మెల్యే పాయంకు తీర్ధప్రసాదాలు అందించారు.

- Advertisement -

జాతరకు కట్టుదిట్టమైన భద్రత…
జాతరకు వచ్చే భక్తులతో మినీ మేడారం అయిన‌ తోగ్గూడెం గ్రామం కిటకిటలాడుతుండడంతో ట్రాపిక్ సమస్య తలెత్తకుండా మణుగూరు సి.ఐ సతీష్, ఎస్.ఐ రాజేష్, తన సిబ్బందితో కలిసి మళ్లింపు చర్యలు చేపట్టారు. హెవీ వాహనాలను మరోక మార్గం ద్వారా రాకపోకలు చేపట్టారు. ఆలయం ప్రాంతంలో ఎలాంటి గొడవలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత చేపట్టడమే కాకుండా, సి.ఐ సతీష్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సమ్మక తల్లిని వనం నుండి ఊరేగింపుగా తీసుకువచ్చే సమయంలో తొక్కిసలాట జరుగకుండా రోప్ వే సిబ్బందిని ఏర్పాటు చేశారు.

వాసవి క్లబ్, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం…
సమ్మక్క, సారక్కల దర్శనం కోసం వచ్చే భక్తులకు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గత రెండు రోజులు నుండి అన్నదానం కార్యక్రమాన్ని చేపట్టారు. జాతర పూర్తయ్యే వరకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని వ్యవస్థాపక అధ్యక్షులు దోసపాటి వెంకటేశ్వర రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో దోసపాటి నాగేశ్వరరావు, దోసపాటి రాము, దోసపాటి పిచ్చేశ్వరరావు, వాసవి క్లబ్ జిల్లా అధ్యక్షులు చారుగుళ్ళ శ్రీనివాస్, మణుగూరు క్లబ్ అధ్యక్షులు కేశ ప్రసాద్, మిట్టపల్లి శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement