Saturday, May 18, 2024

నెలాఖరులోగా టీచర్ల బదిలీలు, పదోన్నతులు.. వారంలో సీనియారిటీ లిస్ట్ రెడీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఈనెల నెలాఖరులోగా ప్రభుత్వ, పంచాయతీరాజ్‌ ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ మొదలవుతోందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పీఆర్‌టీయటీఎస్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు, ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్థన్‌రెడ్డిలు సోమవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి ఈమేరకు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి వారితో మాట్లాడుతూ ప్రభుత్వ, పంచాయతీరాజ్‌ టీచర్లతోపాటు మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయులకు కూడా బదిలీలు, పదోన్నతులు కల్పిస్తామని తెలిపినట్లు పింగలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు తెలిపారు. దీనికి అనుగుణంగా వారం రోజుల్లో సీనియారిటీ జాబితాలు రూపొందించే విధంగా డీఈవోలకు ఆదేశాలు జారీచేస్తున్నట్లు తెలిపారు.

అనంతరం పరస్పర బదిలీలకు సంబంధించి ఒప్పందపత్రం సమర్పించినవారికి వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని అధికారులకు సీఎస్‌ ఆదేశించినట్లు పేర్కొన్నారు. జీఏడీ ఆమోదం పొందిన తర్వాత ఆర్థిక శాఖ ఆమోదంతో ఒకట్రెండు రోజుల్లో ఉపాధ్యాయులకు ఉత్తర్వులు అందుతాయన్నారు. సమగ్రశిక్ష ఉద్యోగులందరికీ బదిలీల షెడ్యూల్‌ కూడా ఈ వారంలో విడుదలవుతోందని వారు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement