హైదరాబాద్ – తెలంగాణలోని కొత్తగా మరో మూడు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు అటానమస్ హోదా దక్కింది. ఆయా కాలేజీలు న్యాక్-ఏ గ్రేడ్ను దక్కించుకోవడంతో యూజీసీ అటానమస్ హోదాను కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నది. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, నల్గొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ, నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు అటానమస్ హోదా దక్కింది. గతేడాది రాష్ట్రంలోని 11 డిగ్రీ కాలేజీలకు అటానమస్ హోదాను పొందాయి. కొత్తగా మూడు కాలేజీలతో అటానమస్ హోదా దక్కించుకున్న కాలేజీల సంఖ్య మొత్తం 14 చేరింది.
అటానమస్ హోదా విషయంలో యూజీసీ కొంతకాలం కిందట పలు మార్పులు చేసింది. వర్సిటీలతో సంబంధం లేకుండా నేరుగా యూజీసీకి దరఖాస్తు చేసేలా పోర్టల్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. కాలేజీని ఏర్పాటు చేసి పది సంవత్సరాలై ఉండి, న్యాక్-ఏ గ్రేడ్ పొందితే ఆయా కాలేజీకి అటానమస్ హోదాను కల్పించనున్నది. తొలుత పదేండ్ల పాటు అటానమస్ హోదా ఇవ్వనుండగా.. 15 ఏండ్ల పాటు అటానమస్ హోదా కలిగి ఉంటే శాశ్వత అటానమస్ హోదాను ఇవ్వనున్నారు.