Sunday, May 5, 2024

సంతోష్, పద్మ మృతికి కారకులైనవారిని కఠినంగా శిక్షించాలి.. టీడీపీ నేత బక్కని నర్సింహులు

ఉమ్మడి మెదక్ బ్యూరో/ మెదక్ ప్రతినిధి (ఆంధ్ర ప్రభ) : సంతోష్, పద్మ మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని టిటిడిపి అధ్యక్షుడు బక్కని నర్సింహులు డిమాండ్ చేశారు. ఆదివారం మెదక్ రామాయంపేటలోని సంతోష్ నివాసానికి చేరుకొని ఆయన తండ్రిని, బంధువులను పరామర్శించారు. అనంతరం మెదక్ పార్లమెంట్ అధ్యక్షులు రమేష్, మెదక్ నియోజవర్గ అధ్యక్షుడు గంగాధర్ లతో కలిసి మాట్లాడుతూ అధికార పార్టీకి చెందిన నేతలు డబ్బుల కోసం మానవత్వం మరిచి బాధితులను క్షోభకు గురి చేశారని, ఫలితంగానే బాధితులు బలవన్మరణానికి పాల్పడ్డారని ఆరోపించారు. బాధితులైన సంతోష్ ఆయన తల్లి పద్మలు గత డిసెంబర్ లోనే మెదక్ జిల్లా కలెక్టర్, ఎస్పీ, రాజకీయ ప్రముఖులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోలేదని, దాని ఫలితమే నేడు భాదితులైన సంతోష్, ఆయన తల్లి పద్మలు నేడు మన మధ్య లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ అండతో పోలీసులు సైతం మానసికంగా హింసించడం దారుణమని, బాధితులకు అండగా నిలవాల్సిన పోలీసులే భక్షించారని ఆవేదన చెందారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సి ఎం కేసీఆర్, డిజిపి లు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

దోషులకు శిక్ష పడే వరకు టిటిడిపి పోరాటం
సంతోష్ ఆయన తల్లి పద్మ లా మృతికి కారణమైన దోషులకు శిక్ష పడేవరకు టిడిపి పోరాటం కొనసాగిస్తుందని టిడిపి అధ్యక్షుడు బక్కని నర్సింలు స్పష్టం చేశారు. అధికార మదం రాజకీయ అండ తో టిఆర్ఎస్ పార్టీ నాయకులు రెచ్చి పోతున్నారని ఫలితంగానే రాష్ట్ర వ్యాప్తంగా అమాయకమైన ప్రజలపై దాడులు జరుగుతున్నాయన్నారు టిఆర్ఎస్ నేతలు తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్ స్పందించటం బాధితుల మృతికి కారణమైన టిఆర్ఎస్ నాయకులను,బాద్యులైన పోలీసు అధికారులను తక్షణం సస్పెండ్ చేసి బాధిత కుటుంబాలకు సత్వరమే న్యాయం చేయాలని నర్సింలు గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే తెలుగుదేశం పార్టీ తరపున పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఆనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ.కె గంగాధర్ రావు మాట్లాడుతూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని దోషులను కఠినంగా శిక్షించి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పార్లమెంట్ నాయకులు అఫ్జల్,సత్యనారాయణ రెడ్డి,అశోక్ గుప్త,బాయికాడి, నర్సింలు,కృష్ణ,నాగేష్,మండల అధ్యక్షులు లక్ష్మన్ యాదవ్ నాయకులు బిట్ల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement