Sunday, April 28, 2024

దళిత బంధుపై మరో పిటిషన్.. హైకోర్టు కీలక సూచన

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న దళిత బంధు పథకంపై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. దళిత బంధు కోసం ప్రభుత్వం 7 కోట్ల 60 లక్షల రూపాయలు విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ లంచ్ మోషన్ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిని అత్యవసరంగా విచారించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది సుంకర నరేష్ హైకోర్టును కోరారు. అయితే, పిటిషనర్ అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. గతంలో కూడా ఇదే అంశంపై పిటిషన్ వేశారని గుర్తు చేసిన హైకోర్టు… అత్యవసరంగా విచారించలేమని స్పష్టం చేసింది.

రాష్ట్రంలోని దళితుల జీవితాలను సమూలంగా మార్చివేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన దళితబంధు పథకం గురువారం(ఆగస్ట్ 5) ప్రారంభమైంది. సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామం వాసాలమర్రిలోని 76 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ప్రభుత్వం రూ.7.60 కోట్లు విడుదల చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం అమలుల్లోకి వచ్చింది. ఈ పథకాన్ని ముందుగా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టాలని నిర్ణయించగా, బుధవారం వాసాలమర్రిలో పర్యటన సందర్భంగా అక్కడినుంచే ప్రారంభిస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ఈ నెల 16న కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో దళిత కుటుంబాలు, దళిత ప్రజాప్రతినిధులు, దళిత మేధావులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ బహిరంగసభ నిర్వహించి పైలట్‌ ప్రాజెక్టును చేపడతారని అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: దళిత బంధు పథకం అమలు కోసం మార్గదర్శకాలు విడుదల

Advertisement

తాజా వార్తలు

Advertisement