Friday, May 3, 2024

Gadwala: ప్రజారోగ్యమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం.. ఎమ్మెల్యేలు

జోగులాంబ గద్వాల (ప్రతినిధి), జులై 1(ప్రభ న్యూస్) : గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.70 లక్షల వ్యయంతో నిర్మాణమైన రేడియాలజీ హబ్ ను స్థానిక శాసన సభ్యులు బండ్ల కృష్ణ మెహన్ రెడ్డి, అలంపూర్ శాసనసభ్యులు డాక్టర్ వి.యం.అబ్రహం ముఖ్య అతిథిలుగా హాజరై ప్రారంభించారు. ఎమ్మెల్యేల చేతుల మీదుగా రేడియాలజీ ల్యాబ్ ను, 134 రకాల పరీక్షలు హబ్ ను రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించడం జరిగినది. ముందుగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, డాక్టర్ వి.యం.అబ్రహం, ప్రజా ప్రతినిధులు, జిల్లా వైద్యాధికారి, వైద్యులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రితో మాట్లాడుతూ.. జాతీయ వైద్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి గద్వాలకు సిటీ స్కానింగ్ అవసరం, మెడికల్ కాలేజీ గురించి మంత్రితో ఎమ్మెల్యేలు మాట్లాడడం జరిగింది. మంత్రి సానుకూలంగా స్పందించి త్వరలోనే సిటీ స్కానింగ్ ఏర్పాటు చేస్తామని, అదేవిధంగా మెడికల్ కాలేజ్ సంబంధించిన జీవోను కూడా వారం 15 రోజుల్లో శాంక్షన్ చేస్తామని తెలిపారు.

గద్వాలలో కొనసాగుతున్న 300 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను, నర్సింగ్ కాలేజ్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని మంత్రి సూచించారు. ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. జాతీయ వైద్య దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో వైద్య రంగానికి పెద్దపీట వేయడం జరిగిందన్నారు. గతంలో ఈ ప్రాంతంలో సరైన వైద్య సదుపాయాలు లేక ఈ ప్రాంతం నుండి ప్రజలు కర్నూలు, హైదరాబాదు వంటి ప్రాంతాలకు వైద్య సదుపాయాల కోసం వెళ్లేవారని, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనేవారన్నారు. ప్రధానమైన ఆరోగ్య సమస్యలు, రోడ్డు ప్రమాదాలు జరిగినా సరైన వైద్యం అందనప్పుడు కర్నూలు వంటి ప్రాంతాలకు వెళ్లేటప్పుడు దారిలోనే కొంతమంది ప్రాణాలను కోల్పోవడం జరిగేదని, ఇలాంటి ఎన్నో సంఘటనలు గతంలో జరిగాయని పేర్కొన్నారు. నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వాసుపత్రిలో పేద ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల వ్యాధులకు సంబంధించిన రోగాలకు చికిత్స పొందే విధంగా వైద్యులతో వైద్యం అందించే గద్వాల జిల్లా ఆస్పత్రిలో తెలంగాణ డయాగ్నోసిక్ ద్వారా ఉచితంగా 57 రకాల పరీక్షలను నిర్వహించేవారు. కానీ వాటిని పెంచి నేటి నుంచి 134 రకాల పరీక్షలకు చేసే విధంగా ఇప్పటి వరకు టి- డయాగ్నోసిక్ 10 కోట్లకు పైగా ఉచిత టెస్టులను 57.68 లక్షలు మందికి రోగాలకు ప్రయోజనం చేశారన్నారు.

నేడు రాష్ట్రంలో గద్వాల జిల్లాలలో నూతన రేడియాలజీ, పాథాలజీ ల్యాబ్ ను ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుందన్నారు. గద్వాలకు త్వరలోనే సిటీ స్కానర్ ఏర్పాటు చేయాలని మంత్రిని కోరడం జరిగిందని, మంత్రి కూడా సానుకూలంగా స్పందించి ఏర్పాటు చేస్తామని తెలిపారన్నారు. అదేవిధంగా మెడికల్ కాలేజీకి సంబంధించిన జీవో ని కూడా ఇస్తామని తెలిపారు. కరోనా కష్ట సమయంలో కూడా తమ ప్రాణాలను సైతం లెక్క చేయక ఎంతోమంది కరోనా బాధితులకు సేవలందించిన ప్రతి ఒక్క వైద్యులకు వైద్య సిబ్బందికి పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బి.యస్ కేశవ్, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ జంబు రామన్ గౌడ, జడ్పీ వైస్ చైర్మన్ సరోజమ్మ, అన్ని మండలాల ఎంపీపీలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement