Friday, May 3, 2024

TS: తెలంగాణ ఛత్రపతి సర్దార్ సర్వాయి పాపన్న… మంత్రి గంగుల

గోల్కోండ కోటపై జెండా ఎగరేసిన బహుజన వీరుడు, తెలంగాణ చత్రపతి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. శుక్రవారం కరీంనగర్ లో సర్వాయి పాపన్న 373వ జన్మదినం సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ… తెలంగాణ రాక ముందు పోరాట యోధులను, మహానీయులను సమైక్య ప్రభుత్వం విస్మరించిందని, తెలంగాణ ప్రభుత్వం మహనీయుల ఆశయాలను కొనసాగిస్తుందన్నారు. బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన చరిత్ర సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ది అని, ఆయన పోరాట పటిమను పౌరుషాన్ని ప్రతఒక్కరూ ఆదర్శంగా తీసుకొని రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు..

ఆయన చరిత్రను బాహ్య ప్రపంచానికి తెలిపే విధంగా కార్యక్రమాలు చేపడతామని పునరుద్ఘాటించారు.
300సంవత్సరాల కంటే ముందే బహుజన రాజ్యం కోసం గోల్కొండ కోటను అధిరోహించి గోల్కోండ సింహాసనాన్ని వశపరుచుకున్న బడుగు, బలహీన వర్గాల నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న అని గుర్తు చేశారు. పాపన్న గౌడ్ ఒక గౌడకులానికే కాకుండా బీసీ సామాజిక వర్గానికి అన్ని కులాలకు సహకరించిన ధీరుడని, పెత్తందారులను ఎదురించి పేద ప్రజలకు అండగా నిలిచి ఆదుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ బి గోపి, అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయి, నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ గౌడ్, ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి, బారాసా నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్, గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్, రెడ్డ వేణి మధు కలర్ సత్తన్న, కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement