హైదరాబాద్, ఆంధ్రప్రభ: 13 జిల్లాల్లో బ్లాక్ చేసిన స్పౌజ్ (ఉపాధ్యాయ దంపతులు) బదిలీలు ఇప్పట్లే అయ్యేట ట్లుగా కనబడుతలేదు. ప్రస్తుతం చేపడుతున్న బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పూర్తి అయ్యాకనే ఆ 13 జిల్లాల ఉపాధ్యాయ దంపతుల బదిలీ ప్రక్రియను మొదలు పెట్టే అవకాశం ఉంది. ఆ దిశగా విద్యాశాఖ యోచిస్తున్నట్లుగా తెలిసింది. అయితే 13 జిల్లాల్లో నిలుపుదలలో ఉంచిన ఎస్జీటీ, పండిట్, పీఈటీ, స్కూల్ అసిస్టెంట్లను ఈ షెడ్యూల్లోనే బదిలీ చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. బదిలీల కోసం వీరు దాదాపుగా 20 నెలలుగా ఎదురుచూస్తు న్నారు. 13 జిల్లాల్లోని ఉపాధ్యాయ దంపతులను ఒక చోటకు చేర్చాలని వారు కోరుతున్నారు. రాష్ట్రంలని 33 జిల్లాలకుగానూ 20 జిల్లాల్లో ఇప్పటికే ఉపాధ్యాయ దంపతుల బదిలీలను ప్రభుత్వం పూర్తి చేసింది. మిగతా 13 జిల్లాల బదిలీలను మాత్రం చేపట్టకుండా గతంలో బ్లాక్ చేసింది. అయితే మహబూబ్నగర్- రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో స్కూల్ అసిస్టెంట్ విభాగంలోని 615 మందికి స్పౌజ్ బదిలీలను చేపట్టారు. ఇంకా 1600 మంది స్పౌజ్ బదిలీలు చేపట్టలేదు. వీరు బదిలీల కోసం 2022, జనవరి నుంచి ఎదురుచూస్తున్నారు. దాదాపు 20 నెలలుగా బదిలీల కోసం నిరీక్షిస్తున్నారు.
మంత్రులు, విద్యాశాఖ అధికారులను కలిసి వినతి పత్రాలు ఇచ్చినా, నిరసనలు చేపట్టినా స్పౌజ్ బదిలీల సమస్య పరిష్కారం కావడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భర్త ఒకచోట, భార్య మరోచోట ఉంటు న్నామని, తమను విడదీయొద్దని… కలపాలని ప్రభు త్వాన్ని వారు వేడుకుంటున్నారు. కుటుంబాలకు దూరంగా ఉండలేక, ఉద్యోగం చేయలేక తీవ్ర మనో వేదనకు గురవుతున్నారు. ఈ షెడ్యూల్లోనే బదిలీలు చేపట్టాలని సీఎం కేసీఆర్ను వారు విజ్ఞప్తి చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు మొన్నటి వరకూ బ్రేక్పడిన ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈక్రమంలోనే ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అయితే ముందు ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసే ఆలో చనలో ప్రభుత్వం ఉంది. ఈ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పూర్తి అయిన తర్వాతనే 13 జిల్లాల్లోని 1500 మంది స్పౌజ్ బదిలీలను చేపట్టాలని చూస్తోంది.
పదోన్నతులు కల్పించడం ద్వారా 13 జిల్లాల్లో ఖాళీలు ఏర్పడనున్నాయి. అక్కడ ఏర్పడే ఖాళీలకు అనుగు ణంగా స్పౌజ్ బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం భావి స్తోంది. ప్రస్తుత షెడ్యూల్లోనే స్పౌజ్ బదిలీలు కూడా చేపడితే షెడ్యూల్ అంతా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉందని అధికారుల వాదన. ఈక్ర మంలోనే అక్టోబర్ 3 వరకు బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేసి ఆతర్వాత ఓ వారం రోజుల్లో 13 జిల్లాల స్పౌజ్ బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈక్రమంలోనే స్పౌజ్ ఫోరం నేతలు ఆదివారం నాడు హైదరాబాద్లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు.
స్పౌజ్ బదిలీలు ఇప్పుడే చేపట్టాలి: ఎస్.నరేష్, స్పౌజ్ ఫోరం స్టేట్ కో కన్వీనర్
ప్రస్తుతం చేపడుతున్న బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్లోనే 13 జిల్లాల స్పౌజ్ బదిలీలు చేపట్టాలి. కానీ ప్రభుత్వం మాత్రం ఆ ప్రక్రియ మొత్తం పూర్తి అయ్యాక పరిశీలిస్తామని అంటోంది. అక్టోబర్ తర్వాత ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉండడంతో ఎన్నికల కోడ్ కంటే ముందే ఉపాధ్యాయ దంపతుల బదిలీలు చేప ట్టాలి. బ్లాక్ చేసిన 13 జిల్లాల్లో డీఎస్సీ ద్వారా ఖాళీలు చూపెట్టారు. ఇక ఆ జిల్లాల్లో ప్రమోషన్లు కల్పిస్తే 100 నుంచి 150 వరకు ఖాళీలు ఏర్పడే అవకాశం ఉండ డంతో స్పౌజ్ బదిలీలు వెంటనే చేపట్టాలి. ఒకవేళ కొన్ని జిల్లాల్లో బదిలీలు సాధ్యం కాకపోతే డిప్యూటేషన్ అయినా ఇవ్వాలి. బదిలీలు, పదోన్నతులు, ఎన్నికల కోడ్ అంటూ మరింత కాలయాపన చేయొద్దని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని వేడుకుంటున్నాము.