Saturday, May 4, 2024

Suspicious death – బాసర ట్రిపుల్‌ ఐటీలో మరో విద్యార్థిని ఆత్మహత్య

బాసర ఆర్జీయూకేటీలో మరో విషాదం చోటుచేసుకుంది. వరుసగా రెండో రోజు మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం బాసర ట్రిపుల్‌ ఐటీలో కలకలం రేపింది.

రెండురోజులు క్రితం పీయూసీ మెదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని దీపిక మూత్రశాలలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సంఘటన నుంచి తేరుకోకముందే గురువారం వేకువజామున 2 గంటల ప్రాంతంలో పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న లిఖిత(17) అనే విద్యార్థిని వసతి గృహం 4వ అంతస్తు నుంచి కిందపడింది.తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రిలో చికిత్స చేయించిన అనంతరం భైంస ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నిర్మల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, లిఖిత అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇది ఆత్మహత్య.. లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.

ట్రిపుల్‌ ఐటీ అధికారులు మాత్రం ప్రమాదవశాత్తు జరిగిందని చెబుతున్నారు. ప్రమాదమా.. లేక ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. లిఖిత స్వస్థలం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌. బుర్ర రాజు, రేణుక దంపతుల పెద్ద కుమార్తె. గజ్వేల్‌లో మిర్చిబండి నిర్వహిస్తూ.. రాజు పిల్లలను చదివిస్తున్నారు. వారం రోజుల క్రితమే లిఖిత హాస్టల్‌కు వెళ్లిందని.. ఇంతలోనే ఇలా జరగడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement