Wednesday, May 1, 2024

ADB :ఓట్ల లెక్కింపుకు కట్టుదిట్టమైన బందోబస్తు

ఉమ్మడి ఆదిలాబాద్, డిసెంబర్ 2(ప్రభ న్యూస్) ఆదివారం నిర్వహించే అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు పోలీస్ యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు గావించింది. ఉదయం 8 గంటల నుండి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుండగా మొదట పోస్టల్ బ్యాలెట్ లను లెక్కించి ఎనిమిదిన్నర గంటల తర్వాత సాధారణ ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

తొలి ఫలితం ఉదయం 10:30 గంటల తర్వాత విడుదల కానుంది. కౌంటింగ్ పాసులు ఉన్న వారికి మాత్రమే ఓట్ల లెక్కింపు కేంద్రాలకు అనుమతించేలా చర్యలు తీసుకున్నారు. అదిలాబాద్, బోత్ నియోజవర్గాలకు సంబంధించి ఆదిలాబాద్ లోని టీటీడీసీ కేంద్రంలో ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా, నిర్మల్ జిల్లాకు సంబంధించి మూడు నియోజకవర్గాలు నిర్మల్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల కేంద్రంలో, అసిఫాబాద్ కొమురం భీం జిల్లాకు సంబంధించి సిర్పూర్ టి, కొమరం భీమ్ నియోజకవర్గాలు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో, మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల సెగ్మెంట్ల ఓట్ల లెక్కింపు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐజా సెంటర్ వద్ద చేపట్టేలా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. ఓట్ల లెక్కింపు వద్ద అసాధారణ రీతిలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు గావించారు.
ఆదిలాబాద్ లో కెఆర్కె కాలనీవాసులకు దారి మళ్లింపుః ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి
డిసెంబర్ 3 రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల లెక్కింపు ప్రక్రియ లో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలోని స్థానిక టిటిడిసి ప్రాంగణం నందు ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుందని అదిలాబాద్ ఎస్పి డీ. ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం కే ఆర్ కే కాలనీ, బాలాజీ నగర్ కాలనీలకు దారి మల్లి oచి ప్రజలకు ఇతర మార్గాల గుండా ట్రాఫిక్ క్రమబ ద్దీకరించినట్టు ఎస్పీ తెలిపారు. లెక్కింపు ప్రక్రియ పూర్తి సజావుగా కొనసాగేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం అన్ని విధాలుగా ఏర్పాట్లను పూర్తి చేసిందని జిల్లా ఎస్పీ డి. ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా లెక్కింపు ప్రక్రియ కొనసాగే స్థానిక టీటీడీసీ ప్రాంగణం ఒక కిలోమీటర్ చుట్టుపక్కల ప్రాంతం అంతా నిషేధాజ్ఞలు కొనసాగుతాయని జిల్లా ఎస్పీ తెలిపారు. కౌంటింగ్ హాల్ పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ కొనసాగుతుందని తెలిపారు.ఎన్నికల లెక్కింపు పూర్తి అయ్యేంతవరకు జిల్లా వ్యాప్తంగా మద్యం షాపులు, బెల్ట్ షాపులు నిర్వహించకూడదని మూసి ఉంచాలన్నారు.కౌంటింగ్ హాల్ అనుమతి ఉన్నవారికి మాత్రమే కౌంటింగ్ హాల్ పరిసరాలకు రావాలన్నారు.కౌంటింగ్ హాల్ పాసెస్ ఉన్న ఏజెంట్లు సెల్ ఫోన్లు, అగ్గి డబ్బా, ఇంకు బాటిల్, లాంటి అనుమతి లేని వస్తువులను తీసుకురాకూడదని అన్నారు.ఏజెంట్ల మార్పిడి అనేది ఉండదని తరచూ లోనికి, బయటకు తిరిగే అవకాశం ఉండదునీ ఎన్నికల నిబంధనలు పాటించాలన్నారు. కౌంటింగ్ అయిన తరువాత 24 గంటల వరకు ఎటువంటి విజయోత్సవ ర్యాలీలకు, టపాసులకు అనుమతి లేదనీ ఎస్పీ తెలిపారు. 144 సెక్షన్ నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నందున ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు గుమి గుడి ఉండటానికి అనుమతి లేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement