Thursday, May 2, 2024

నిలిచిపోయిన ఆటోలు, క్యాబ్‌లు, లారీలు.. ఎందుకంటే..

హైద‌రాబాద్‌లో ఇవ్వాల (గురువారం) ఆటోలు, క్యాబ్‌లు, లారీలు బంద్ అయ్యాయి. తెలంగాణ‌ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మోటారు వాహనాల చట్టం 2019 అమలును తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఈ బంద్ జ‌రుగుతోంది. ఆటో, క్యాబ్, లారీ డ్రైవర్ల యూనియన్ జేఏసీ ఇచ్చిన ఒక్క రోజు బంద్‌ పిలుపుతో గత అర్ధ రాత్రి నుంచి సేవలు నిలిపివేశారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ వెంకటేశం మాట్లాడుతూ.. పెరిగిన‌ పెట్రో ధరలతో ఇప్పటికే అవస్థ పడుతున్న తమపై అదనపు భారం సరికాదన్నారు.

జరిమానాల పేరుతో ప్రైవేటు ట్రాన్స్‌పోర్టు డ్రైవర్లను ప్రభుత్వం నిలువు దోపిడీ చేస్తోందని ఆవేదన వెంక‌టేశం వ్యక్తం చేశారు. నూతనంగా తీసుకొచ్చిన చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్‌తో ఇవ్వాల హైద‌రాబాద్‌లోని ఖైరతాబాద్ చౌరస్తా నుంచి ట్రాన్స్‌పోర్టు భవన్ వరకు భారీగా తరలివెళ్లి నిరసన తెలుపుతామన్నారు. కాగా, ఈ బంద్‌లో ఏఐటీయూసీ, సీఐటీయూ, టీఆర్ఐఎఫ్, క్యాబ్, ఆటో, లారీ సంఘాలు పాల్గొంటున్నాయి. కాగా, ఆటోలు, క్యాబ్ సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. నిన్న అర్ధ రాత్రి నుంచి ముఖ్యమైన మార్గాల్లో ప్రత్యేక బస్సులు నడుపుతోంది. బస్సులు అవసరమైనవారు 99592 26160, 99592 26154 నంబర్లు ఫోన్ చేయాలని గ్రేటర్ జోన్ ఈడీ యాదగిరి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement