Saturday, May 4, 2024

Special Story – గులుగుడు, గులుగుడే.. గుద్దుడు గుద్దుడే!

పోరాడి సాధించుకున్న తెలంగాణ‌ను బాపు కేసీఆర్​ ఓ దరికి తెచ్చిండు. తొమ్మిదిన్న‌రేండ్లలో వందేండ్ల‌కు మించిన డెవ‌ల‌ప్ జ‌రిగింది. అయితే.. ఇక్కడ మేము అనుకున్నవి, ఆశ‌ప‌డ్డ‌వి కొన్ని కాక‌పోవ‌చ్చు. దానికి మాలో మాకే లేనిపోని లొల్లిపుట్ట‌స్త‌రా? అవును.. తెలంగాణ మాది, మా ఫ్యామిలీ.. కోప‌మొస్తే ఇంటి పెద్ద మీద అలుగుతం, గుణుగుతం, ఆఖ‌రికి గులుగుతం.. అంతమాత్రాన మా బాపు మాకు కాకుండపోత‌డా?
ఇదీ తెలంగాణలో సగటు ఓటరు మనోగతం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకుపై ఆశ‌లు పెట్టుకున్న ప్ర‌తిప‌క్ష‌ పార్టీలకు కడకు కాళ్లు అరుగుడు, కండ్లు తిరుగుడేన‌ని దీన్నిబ‌ట్టి తెలుస్తోంది. ఎందుకంటే.. ‘‘మాకు మాకూ సవాలక్ష ఉంటయ్​.. మధ్యలో మీరెవ‌ర్రా అన‌నీకి’’? అంటూ మండిప‌డుతున్నరు యువతీ, యువకులు. మా ఇంటి పెద్ద మీద‌ గులుగుడు గులుగుడే, ఆఖ‌రికి ఓట‌రు మిష‌న్‌ మీద‌ గుద్దుడు గుద్దుడే! అంటున్నరు జ‌నం!

ప్రజాస్వామ్య వ్యవస్థలో చూపుడు వేలే కీలకం. అది వజ్రాయుధం. ఈ ఆయుధదారే అధికార ప్రదాత. స్వాతంత్ర్యం వచ్చిన తొలి అర్ధ శతాబ్దిలో.. ఓటు హక్కు చాలామందికి తెలీదు. ఎన్నికలొస్తే గెలిచే పెత్తందారు జమీన్లు.. జమీన్ల పాలెగాళ్లు పల్లెల్ని శాసించేటోళ్లు. మగోళ్లకు మందు పోయిచి, ఓట్లు తామే వేసుకునేటోళ్లు. కానీ, 80వ దశకంలో రాజకీయ పరుగు మారింది. ప్రజలే దేవుళ్లుగా మారారు. నాయకులు మొక్కే స్థితికి ఎదిగారు. కానీ, ఓటరు చేతికి మందు సీసా, ఆడాళ్ల చేతిలో నోటు కాగితం పెట్టే సంస్కృతి కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఆ ఆనవాయితీ మారకపోయినా ఇంకాస్త రేట్లు పెరిగాయి. ఎన్నికల్లో సూట్​కేసులు పెరిగాయి. కోట్లకు కోట్లు కుమ్మరిస్తేనే పార్టీ గెలుస్తుందనే అత్యాశ పెరిగింది. కానీ, ఆ పరిస్థితి మారిందంటే… ఈ కోటీశ్వర్లు బిక్కచచ్చిపోక తప్పదు. ఎవరు డబ్బులిచ్చినా తీసుకుందాం? నచ్చినోడికే ఓటేద్దాం? ఆ డబ్బులు మనవే. మన దగ్గరే కొల్లగొట్టి మనకు పంచుతున్నారు? ఇక మనం ఎందుకు వదలాలి? ఇదీ ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో జనం మాట.

అన్ని పార్టీల్లో గుబులే గుబులు..
విచిత్ర మేమిటంటే.. తెలంగాణ ఎన్నికల్లో ప్రభుత్వ ప్రతికూల పోలింగ్ జరుగుతుందని గంపెడాశతో … సామదాన దండోపాయాలతో ఉరుకులు పరుగులు పెడుతున్న ప్రతిపక్షాలకు కడకు కాళ్లరుగుతాయి. కండ్లు తిరుగుతాయి. ఇది నిజం. పచ్చి నిజం. తెలంగాణ రాజకీయ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ ఏకచత్రాధిపత్యం నడిచింది. 1983 తర్వాత రాజకీయాల స్థితి, గతి మారిపోయింది. జనంలో ఆత్మభిమానం చిగురించింది. ప్రజలు ఆలోచనలో పడ్డారు. ఎన్నాళ్లు ఈ బాన్చన్ గిరి. చెంచాగిరి. ఎవరో వచ్చి మన చేతిలో ఓటును శాసించటం.. ఈ ప్రశ్నలు దావాలనంలా వ్యాపించాయి. చైతన్యం వెల్లివిరిసింది. అంతే తమ బాగును పట్టించుకోని పార్టీలో భరతం పట్టటం ఆరంభమైంది. కాంగ్రెస్ రథ చక్రాలు కుంగిపోయాయి. తెలుగు దేశం సైకిల్ హ్యాండిల్ వంకర పోయింది. రిమ్ విరిగింది. కాషాయదళం చెవిలో బీజేపీ కమలపువ్వు అలంకారమైంది. ఇక తెలంగాణ ఉద్యమంతో ఊపిరి పోసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితిని జనం ఆశీర్వదించారు. ఈ ఆశతోనే టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్​గా అవతరించింది. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చి.. జనహితంతో, అభివృద్ధి పథాన పరుగులు పెట్టేందుకు దళపతి కేసీఆర్ నాయకత్వంలో జైత్రయాత్రకు బయలు దేరింది.

ప్రభుత్వంపై తిట్లు, జనంపై ఒట్లు..
పదేళ్లుగా అధికారం అందక… కనీసం ఈ సారైనా సింహాసనాన్ని అధిష్టించాలని అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ సైన్యాలు అరుపులు, కేకలతో కదం తొక్కుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకును కైవసం చేసుకునేందుకు రెండు పార్టీలు నువ్వానేనా అనే రీతిలో వ్యూహ ప్రతివ్యూహాలతో చెలరేగిపోతున్నాయి. అవినీతి అక్రమాలపై ఆరోపణలే ఎజెండాగా సాగుతున్నాయి. అన్ని వేల కోట్లు తిన్నారు. మింగారు. బొక్కారు. వాళ్లకు పంచారు. పంచుకున్న దాంట్లో వాటా గుంజారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి. వృథా ఖర్చులు. వీళ్లని జైల్లో పెట్టాలి. ఆడోళ్లకు అవి ఇస్తాం. రైతులకు ఇవి ఇస్తాం. . ఇవే ప్రభుత్వంపై ప్రతిపక్షాల తిట్లు. ప్రజల ఓట్లకు కోసం హామీల ఒట్లు. కానీ, ఆ పార్టీలు ఇత‌ర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న దగ్గర జరిగిన డెవలప్​ మెంట్​ ఏమిటి? అక్క‌డి రాష్ట్రాల్లో ఎటువంటి ప్ర‌గ‌తి సాధించారు. అలాంటి ప్ర‌గ‌తిని ఇక్క‌డ ఎలా సాధించ‌గ‌ల‌రో చెప్పే వారు లేరు.

ఏందీ లొల్లి ..
ఆకలేసింది. అన్నం తింటాం. ఒక్కొసారి అన్నం ఉడకదు. పప్పులో ఉప్పు చాలదు. చారులో నీళ్లుంటాయి. కోడికూరలో మసాల చాలదు. కోపం వస్తుంది. గొణుగుతాం. అలుగుతాం. అంతమాత్రాన అన్నం పెట్టినోళ్ల వీపు మీద గుద్దుతామా? ఇదీ తెలంగాణలో సగటు ఓటరు మనోగతం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకుపై గంపెడాశలు పెట్లుకున్న రాజకీయ పార్టీలకు కడకు కాళ్లు అరుగుడు. కండ్లు తిరుగుడే. ఎందుకంటే.. మాకు మాకూ సవాలక్ష ఉంట‌య్‌. మధ్యలో మీరెవ‌ర్రా? నోట్లు ఇస్తారా? ఇవ్వండి. మందు పోయిస్తారా? పోయించండి. కానీ, ఓటు మాత్రం మాదే.. మాకు నచ్చినోళ్లకే వేస్తాం. ఇదీ తెలంగాణ సామాన్య జనం మాట‌.

- Advertisement -

ఏనాడన్నా కనిపించిండ్రా.. జనం ప్రశ్న

24 ఏళ్ల కిందట ఏనాడన్నా జనం కనిపించిన్రా? అటు వీడని కరువు పీడ. ఇటు తాగనీకి చుక్క నీరు లే. వర్షం పడడు. పొలాలన్నీ నెర్రలిస్తే.. పిడికెడు మెతుకుల కోసం వలసకు పరుగులు పెట్టినం. ఎట్టా బతికనమో? ఎరుక లే. పద్నాలుగేళ్లు కేసీఆర్ పోరాడిండు. చావు నోట్లో తలపెట్టిండు. తెలంగాణ తెచ్చిండు. పదేళ్లల్లో బతుకులు మార్చిండు. మిషన్ భగీరథతో నీళ్లు వచ్చినయ్‌. తాగునీటికి ఢోకా లేదు. అర్ధరాత్రి, అపరాత్రి లేదు. 24 గంటలూ కరెంటు ఆగదు. రైతు బంధు, రైతు బీమా,,నేతన్నకు బీమా దీమా, ధరణి, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్.. గింతేందీ? పిల్లగాళ్లకు పారెన్ చదువు, పేద బిడ్డలకు మంచి చదువులు, దవాఖానాలు, మెడికల్ కాలేజీలు, ఇలా ఎన్నో చేసిండు. పథకాలన్నీసెటిలర్స్ లేదు. తెలంగాణ లేదు. అందరికీ పంచిండు. ఇంకా ఇప్పడు దళిత బంధు ప్రకటించిండు. ఇన్ని చేస్తంటే.. ఎలా వదులుతాం. ఆగమైపోమూ? కాస్త లొల్లి ఆపండి. మాకు మాకు ఎన్నో ఉంట‌య్‌.. సవాలక్ష ఉన్నా. మా పని మాదే. కేసీఆర్ మాతండ్రి. ఆయనతో గొడవ పడ్తాం. గొణుగుతాం. ఓట్ల మిషన్‌పై ఆఖ‌రికి గుద్దుడే గుద్దుడు.. ఆగదు. ఆగదంతే.

Advertisement

తాజా వార్తలు

Advertisement